స్టూడెంట్లకు రాగి లడ్డూలు

స్టూడెంట్లకు రాగి లడ్డూలు

విద్యార్థినులు ఎదుర్కొంటున్న ప్రధానమైన రక్తహీనత సమస్యకు చెక్‌‌ పెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వారికి బలమైన ఆహారం అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది నుంచే స్టూడెంట్లకు రాగి లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి కేంద్రం ప్రభుత్వ అధీనంలోని ప్లానింగ్‌‌ అప్రూవల్‌‌ బోర్డు (పీఏబీ) కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తీసుకుని, ఈ విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

వారంలో మూడు రోజులు…
రాష్ర్టంలోని సుమారు 25 వేల సర్కారు స్కూళ్లల్లో 22 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇందుకు ఈ ఏడాది రూ.318కోట్లు కేటాయించగా, దీంట్లో కేంద్రం రూ.200 కోట్లు, రాష్ర్టం రూ.118కోట్లు ఇవ్వనుంది. ఇక 6, 7, 8 తరగతుల్లో 3,53,565 మంది అమ్మాయిలు ఉన్నారు. గతేడాది విద్యాశాఖ నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఇందులో చాలా మంది విద్యార్థినులు రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో ఆ సమస్యకు చెక్‌‌ పెట్టేందుకు ఇప్పటికే కొన్ని కేజీబీవీల్లో ఆర్గానిక్‌‌ కిచెన్‌‌ గార్డెన్స్‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, తాజాగా స్కూళ్లలోని విద్యార్థినులకు రాగిలడ్డూలు ఇవ్వాలని, బడుల్లో న్యూట్రిషియన్‌‌ కిచెన్‌‌ గార్డెన్స్‌‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వారంలో మూడు రోజుల చొప్పున మొత్తం 13 వారాలపాటు 3,53,565 మంది విద్యార్థినులకు అందించనుంది. దీనికి మొత్తం రూ.8.06 కోట్ల నిధులు అవసరం కాగా, వీటిలో కేంద్రం రూ.4.83 కోట్లు, రాష్ర్టం రూ.3.22 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇప్పటికే వారంలో రెండు రోజులు గుడ్డు అందిస్తున్న నేపథ్యంలో, అవి పెట్టని రోజు రాగి లడ్డూ అందించనున్నారు. అయితే 9,10 తరగతుల విద్యార్థినులకూ రాగిలడ్డూలు అందించాలని ప్రభుత్వాన్ని విద్యాశాఖ కోరనున్నట్టు తెలుస్తోంది. సమగ్ర శిక్షా అభియాన్‌‌ (ఎస్‌‌ఎస్‌‌ఏ) 8వ తరగతి వరకూ నిధులు సమకూర్చనుంది. 9,10 తరగతులకు ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేదా అనేది చూడాలి.

బడుల్లో న్యూట్రిషియన్‌‌ గార్డెన్స్‌‌
మధ్యాహ్న భోజనంలో తాజా ఆకుకూరలు, కూరగాయాలు అందించేందుకు బడుల్లో న్యూట్రిషియన్‌‌ గార్డెన్స్‌‌ ఏర్పాటు చేసుకునేందుకు పీఏబీ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది 13,694 బడుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.4.11 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. గతేడాది రాష్ర్టంలో మొత్తం 30,408 కిచెన్‌‌ కమ్‌‌ స్టోర్స్‌‌ నిర్మాణాలకు సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ రూ.16.49 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు 17,483 గార్డెన్స్‌‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 3,698 నిర్మాణాల్లో ఉండగా, మిగతావి ప్రారంభం కాలేదు. డిసెంబర్‌‌ 31లోగా అన్ని బడుల్లో నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని కేంద్రం ఆదేశించింది.