
కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 6 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరయ్యారు. ఇది వరకు 4 స్కూల్స్ మంజూరు కాగా, తాజాగా మరో 2 స్కూల్స్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా పరిధిలో 4, కామారెడ్డి జిల్లాలో 2 స్కూళ్లను అత్యాధునిక ప్రమాణాలతో కూడిన సౌకర్యాలతో నిర్మించనున్నారు. ప్రభుత్వం ఒక్కో స్కూల్కు రూ. 200 కోట్లు కేటాయించింది. ఒక్కో స్కూల్ 20 నుంచి 25 ఎకరాల సముదాయంలో ఉంటుంది. డిజిటల్ క్లాస్ రూమ్స్, అకాడమిక్ బిల్డింగ్స్, అడ్మినిస్ర్టేటీవ్ బిల్డింగ్స్, బాయిస్, గర్ల్స్కు వేర్వేరుగా గా హాస్టల్స్, డార్మెటరీ రూమ్స్, లైబ్రరీ, స్టాప్ క్వార్టర్ట్స్ ఉంటాయి. సోలార్ పవర్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేస్తారు.
ఒక్కో స్కూల్లో 2,500 మంది వరకు విద్యార్థులు 6 నుంచి ఇంటర్ వరకు చదువుకొవటానికి వీలుంటుంది. ఫస్ట్ విడతలో నిజామాబాద్ జిల్లా బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాలకు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి వచ్చాయి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజక వర్గానికి ఇచ్చారు. తాజాగా ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాలకు స్కూళ్లు మంజూరయ్యాయి. ఇంకా కామారెడ్డి, నిజామాబాద్ ఆర్బన్, బాల్కొండ నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ప్ రావాల్సి ఉంది.