
- పదేండ్లు అధికారంలో ఉండి మీరెందుకు ఆయన విగ్రహం పెట్టలే
హైదరాబాద్, వెలుగు : మహాత్మా జ్యోతిరావు ఫూలే గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఏనాడైనా ఫూలే జయంతికి గానీ, వర్ధంతికిగానీ కేసీఆర్ హాజరయ్యారా? అని ఆయన ప్రశ్నించారు. బీసీ ఓట్ల కోసమే ఫూలే విగ్రహమంటూ కవిత కొత్త మాట ఎత్తుకున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని మీడియా హాల్లో మాట్లాడారు.
ఈడీ నోటీసులొచ్చిన ప్రతిసారీ కవిత ఇలాంటి కొత్త అంశాన్ని తెరపైకి తెస్తారన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఫూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఫూలే విగ్రహం పెట్టకుండా.. ఇప్పుడు తమకు డెడ్లైన్ పెట్టడం రాజకీయం కాదా? అని ప్రశ్నించారు. ఫూలే విగ్రహంపై రాజకీయం చేస్తున్నదే కవిత అని విమర్శించారు. ఫూలే ఆశయాలను నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు చోట్ల ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.
కవిత చెప్తేనే ప్రగతిభవన్ను జ్యోతిరావు ఫూలే భవన్గా మార్చామా అని నిలదీశారు. ఎప్పుడు ఏం చేయాలో తమ ప్రభుత్వానికి తెలుసన్నారు. కవిత ఏం చేసినా రాజకీయం కోసమే చేస్తుందని, గతంలో బతుకమ్మను పూర్తి రాజకీయంగా మార్చింది ఆమేనని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ఒక్క చోటే పోటీనిస్తుందన్నారు.