
వేములవాడ, వెలుగు: బనకచర్ల పాపం కేసీఆర్దేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. శుక్రవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. గోదావరి జలాల విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న హరీశ్ రావువెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలాగా ఉపయోగపడిందన్నారు. రాజన్న ఆలయ ఈఓ రాధాబాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో ఆర్చరీ అకాడమీ ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో క్రీడలకు రూ. 400 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి 11 నెలల్లోనే రూ. 800 కోట్లు కేటాయించారన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, కనిమెని చక్రధర్ రెడ్డి, మార్కెట్ చైర్ పర్సన్ స్వరూప పాల్గొన్నారు.