ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్పై కసరత్తు

ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్పై కసరత్తు
  • బిడ్లు సమర్పించిన జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీలు  
  •  ఈ వారంలోనే ఎంపిక
  • వచ్చే వారంలో పనులు అప్పగించే అవకాశం 

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ - 2047 రూపకల్పనకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. మాస్టర్​ప్లాన్​రూపకల్పనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) అధికారులు కన్సల్టెంట్స్​ను ఆహ్వానించగా ఆరు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో మెయిన్​హార్డ్​సింగపూర్​ప్రైవేట్​లిమిటెడ్, సర్బానా జరోంగ్​ (సింగపూర్​), లీ అసోసియేట్స్, ఈ కోమ్, సీబీఆర్ఈ, ఇంటర్నేషనల్​కన్సల్టెంట్స్​వంటి కంపెనీలు బిడ్లు సమర్పించాయి. ఈ బిడ్స్​ను మరికొద్ది రోజుల్లో ఓపెన్​చేయనున్నట్టు తెలిసింది. రెండో వారంలో ఎంపికైన సంస్థకు పనులు అప్పగించనున్నారు. 

వరల్డ్​ క్లాస్ సిటీగా.. 

765 చ. కి.మీ పరిధిలోని గ్రామాలతో వరల్డ్ క్లాస్ సిటీగా ఫ్యూచర్​సిటీని నిర్మించాలని అధికారులు ప్లాన్లు రూపొందించారు. ఇప్పుడున్న నగరానికి మించి పలు ప్రత్యేకతలతో ప్రపంచ స్థాయి నగరంగా రూపొందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి ఫ్యూచర్​ సిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టేలా యాక్షన్​ప్లాన్​రెడీ చేశారు.

ఇందులో భాగంగా అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా, తమ యాక్టివిటీస్​ఇక్కడి నుంచి నిర్వహించాలన్నా అన్ని రకాల మౌలిక సదుపాయలు అవసరం. అందుకు తగ్గట్టుగా ఫ్యూచర్​సిటీని రూపుదిద్దేందుకు సమగ్ర బృహత్​ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఎఫ్సీడీఏ జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీల నుంచి  మాస్టర్​ ప్లాన్​ కోసం రూపకల్పనకు టెండర్లనుఆహ్వానించింది.