న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, టాస్క్- ఆధారిత పార్ట్ టైం జాబ్ మోసాలు చేస్తున్న 100కు పైగా వెబ్సైట్లను బుధవారం కేంద్ర ఐటీ శాఖ బ్లాక్ చేసింది. ఆన్లైన్ నేరాలపై కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(I4సీ) విభాగం ఇటీవల ఒక రివ్యూ చేసింది. ఆన్లైన్ మోసాలు జరుగుతున్న కొన్ని వెబ్సైట్లను గుర్తించి.. వాటిని తక్షణమే బ్లాక్ చేయాలని ఐటీ శాఖకు సిఫార్సు చేసింది. దీంతో ఐటీ శాఖ బుధవారం100కి పైగా వెబ్సైట్లపై నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఆర్థిక నేరాలను ప్రోత్సహిస్తున్న ఈ వెబ్సైట్లను విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఆర్థిక మోసాల నుంచి వచ్చిన సొమ్మును క్రిప్టో కరెన్సీలు, విదేశీ ఏటీఎం కార్డులు, ఇంటర్నేషనల్ ఫిన్టెక్ కంపెనీల సాయంతో మనీలాండరింగ్ చేస్తున్నట్లు గుర్తించామని ఐటీశాఖ పేర్కొంది. అయితే, ఈ వెబ్సైట్ల వివరాలను వెల్లడించలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు యూజర్లను ఆకట్టుకుంటారని, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.