అప్పుడులేని తెలంగాణ సోయి.. ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ ఫైర్

అప్పుడులేని తెలంగాణ సోయి..  ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ ఫైర్

రాజన్న సిరిసిల్ల: జయ జయహే తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ఫైరయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్. ప్రముఖ తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గీతానికి తుది మెరుగులు దిద్దుతుంది సర్కార్. ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఈ పాటను రీక్రియేట్ చేస్తున్నారు.  ఆయితే, ఆంధ్రవాళ్లు రాష్ట్ర గీతానికి సంగీతం అందించడమేందని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ క్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ  వీడియో విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చిన కేసిఆర్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి... కనీసం జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని విమర్శించారు.

నేడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామంటే కేసీఆర్, కేటీఆర్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. తెలంగాణ గుండె తడి తెలిసిన అణగారిన వర్గానికి చెందిన అందెశ్రీ రాసిన గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తే..బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

ఈ గీతాన్ని ఎంఎం కీరవాణి కంపోజ్ చేస్తే.. అతన్ని ఆంధ్ర మూలాలున్న వ్యక్తిగా కేసీఆర్, కేటీఆర్ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆనాడు..  ఆంధ్ర కోడలు సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా, ఆంధ్ర అమ్మాయి మంచు లక్ష్మిని తెలంగాణ స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్ గా..  రాష్ట్రానికి సంబంధం లేని నటి రకుల్ ప్రీత్ సింగ్ ని బాలిక విద్యకు బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ నియమించినప్పుడు మీకు తెలంగాణ సోయి గుర్తుకు రాలేదా? నిలదీశారు. యాదాద్రి ఆర్కిటెక్ట్ గా ఆంధ్ర సాయిని నియమించినప్పుడు మీ పౌరుషం ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు.