
వేములవాడ, వెలుగు: రాజన్న గోశాలలో ఇటీవల కోడెలు అనారోగ్యంతో మృత్యువాత పడడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడ పరిధి తిప్పాపూర్లోని గోశాలను సందర్శించారు. కోడెల ఆరోగ్య పరిస్థితిని వెటర్నరీ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయం, కోడెల మరణాలపై రాజకీయం చేయడం ప్రతిపక్ష లీడర్లు మానుకోవాలని హితవు పలికారు. వెటర్నరీ అధికారులు, కలెక్టర్, ఆలయ ఈవో, అన్ని విభాగాల అధికారులు కోడెల ఆరోగ్య పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తున్నారన్నారు. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సువిశాలమైన గోశాల నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయనవెంట ఆలయ ఈవో వినోద్రెడ్డి, వెటర్నరీ సిబ్బంది ఉన్నారు.