
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల విజయవంతంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట్ ఎల్లమ్మ, భాగ్యలక్ష్మి ఆలయాలతో సహా వివిధ ఆలయాల్లో జూన్ 26 నుంచి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
శ్రీజగదంబిక అమ్మవారి ఆలయంలో బంగారు బోనంతో ప్రారంభం కాగా.. ఆదివారం సింహవాహిని బోన సమర్పణతో ముగిశాయి. ఈ వేడుకలను సజావుగా నిర్వహించినందుకు పోలీసు, జీహెచ్ఎంసీ, ఎండోమెంట్, విద్యుత్, నీటి సరఫరా శాఖల అధికారులు సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా అందాయని అన్నారు. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి బోనాల పండుగ ప్రతీక అని తెలిపారు.