హైదరాబాద్,వెలుగు: మతపరమైన వ్యాఖ్యలు, దేశ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రెండ్రోజుల కిందట ఓల్డ్ బోయిన్పల్లిలో జరిగిన ఆందోళనలు, జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో సోషల్ మీడియాపై గ్రేటర్ పోలీసులు నిఘా పెట్టారు. రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద కామెంట్స్, వీడియోస్ సర్క్యూలేట్ చేస్తున్న వారి వివరాలను కలెక్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, విమెన్సేఫ్టీపై గత గురువారం హోంమంత్రి మహమూద్ అలీ సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ వర్గానికి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్లో ప్రచారం అవుతున్న 22 పోస్టింగ్స్ను గుర్తించారు. దీంతో పాటు డిపార్ట్మెంట్లో సిబ్బందిపై నిఘా పెట్టారు. వాట్సాప్,ఫేస్బుక్లో వివాదస్పద పోస్టింగ్స్ చేసిన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు.
ఏఆర్ కానిస్టేబుల్కు నోటీసులు
మతపరమైన వ్యాఖ్యలు చేసిన నుపుర్శర్మకు మద్దతుగా పోస్ట్ చేసిన సిటీ కమిషనరేట్ పరిధిలో పనిచేసే ఓ ఆర్మ్డ్రిజర్వ్ కానిస్టేబుల్కు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలితో పాటు మైనర్ల ఫొటోలను వైరల్ చేసిన వ్యక్తులు, గత శుక్రవారం ప్రార్ధనల అనంతరం రేతిబౌలిలో జరిగిన ఆందోళనపై కామెంట్స్ చేస్తున్న వారి వివరాలను రాబడుతున్నారు. రూమర్స్ పోస్టింగ్ చేస్తున్న వారిని గుర్తించాలని స్థానిక పోలీసులకు సూచిస్తున్నారు. సిటీ సౌత్ జోన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, అనుమానితుల కదిలికలపై నిఘా పెట్టారు. పాతనేరస్తులు, రౌడీషీటర్లు, కమ్యూనల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఏదైనా ఇల్లీగల్ యాక్టివీటిస్కు పాల్పడుతున్నారా? అనే డేటాను తయారు చేస్తున్నారు.
ఆవారాలపై స్పెషల్ ఫోకస్
అనుమానితులపై సస్పెక్ట్ షీట్ నమోదు చేయాలని స్థానిక పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హాట్స్పాట్స్గా గుర్తించిన ఏరియాల్లో సెక్టార్ ఎస్ఐతో పాటు నైట్డ్యూటీ సిబ్బందిని ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సిటీలోని పబ్స్, నిర్మానుష్య ప్రాంతాలపై పోలీసులు ఫోకస్ చేశారు. రాత్రి 11 గంటల తర్వాత టూరిస్ట్ స్పాట్స్లో నిఘా పెట్టేలా చర్యలు తీసుకున్నారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వెహికల్స్తో ర్యాండమ్ చెకింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్ గ్రూప్ల్లో తిరుగుతున్న అసభ్యకర ఫోటోలు,స్టేట్మెంట్లు, విజువల్స్ కొన్ని వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నట్లు గుర్తించారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.