- సూపర్–8 చివరి మ్యాచ్లో.. దంచికొట్టిన సంజూ శాంసన్
- 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై విక్టరీ
టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజయభేరి మోగించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన సూపర్-8 ఆఖరి పోరులో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసి దర్జాగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ముచ్చటగా మూడోసారి కప్పు గెలిచేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. తన సత్తాపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ఓపెనర్ సంజూ శాంసన్ (50 బాల్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 నాటౌట్) క్వార్టర్ ఫైనల్ లాంటి కీలక పోరులో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (27) మెరుపులు తోడవడంతో కరీబియన్ టీమ్ ఇచ్చిన 196 రన్స్ టార్గెట్ను ఈజీగా ఛేజ్ చేసింది. ఇండియా టీ20 వరల్డ్ కప్లో సెమీస్కు చేరడం ఇది ఆరోసారి. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది.
కోల్కతా: వెస్టిండీస్ సవాల్ను ఛేదించిన డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా టీ20 వరల్డ్ కప్లో ఆరోసారి సెమీఫైనల్ చేరుకుంది. సంజూ శాంసన్ మెరుపులకు తోడు తిలక్ వర్మ (15 బాల్స్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 27) సత్తా చాటడంతో ఆదివారం జరిగిన సూపర్–8 రౌండ్ గ్రూప్–1 చివరి పోరులో ఇండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. తొలుత వెస్టిండీస్ 20 ఓవర్లలో 195/4 స్కోరు చేసింది. రోస్టన్ ఛేజ్ (25 బాల్స్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 40), రోవ్మన్ పావెల్ ( 19 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్), జేసన్ హోల్డర్ (22 బాల్స్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్) సత్తా చాటగా.. షై హోప్ (32), హెట్మయర్ (27) కూడా రాణించారు.
బుమ్రా (2/36) రెండు వికెట్లతో రాణించాడు. అనంతరం శాంసన్ మెరుపులతో ఇండియా 19.2 ఓవర్లలో 199/5 స్కోరు చేసి గెలిచింది.శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్–1లో రెండో ప్లేస్తో నాకౌట్ చేరిన ఇండియా గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీస్లో గ్రూప్–2 విన్నర్ ఇంగ్లండ్తో తలపడనుంది. బుధవారం కోల్కతాలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తొలి సెమీస్లో పోటీ పడతాయి.
విండీస్ బ్యాటర్ల జోరు..
టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు సత్తా చాటడంతో విండీస్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ టీమ్కు కెప్టెన్ షై హోప్, ఓపెనర్గా బరిలోకి దిగిన రోస్టన్ ఛేజ్ అద్భుత ఆరంభం అందించారు. అర్ష్దీప్ తొలి ఓవర్లో మూడు రన్సే ఇచ్చినా ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్లో హోప్ 6, 4తో గేర్ మార్చగా.. అర్ష్దీప్ తర్వాతి ఓవర్లో ఛేజ్ 4,4తో టచ్లోకి వచ్చాడు. ఇండియా ఫీల్డర్ల తప్పిదాలు విండీస్ జట్టుకు కలిసొచ్చాయి. ఐదో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన బుమ్రా బౌలింగ్లో ఛేజ్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ను అభిషేక్ శర్మ డ్రాప్ చేశాడు. అప్పటికి 14 రన్స్ వద్ద ఉన్న రోస్టన్ ఈ చాన్స్ను సద్వినియోగం చేసుకొని హోప్తో కలిసి చెలరేగిపోయారు.
పవర్ ప్లేను 45/0తో ముగించిన ఓపెనర్లు ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా అదే జోరు కొనసాగించే ప్రయత్నం చేశారు. అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వికెట్ రాబట్టలేకపోయాడు. కానీ, తొమ్మిదో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన వరుణ్ చక్రవర్తి.. హోప్ను క్లీన్ బౌల్డ్ చేసి 68 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన షిమ్రన్ హెట్మయర్ ఉన్నంతసేపు భారీ షాట్లు కొట్టాడు. పాండ్యా బౌలింగ్లో లాంగాన్ మీదుగా భారీ సిక్స్ బాదిన అతను వరుణ్ను టార్గెట్ చేసి 6, 4తో స్టేడియాన్ని హోరెత్తించి స్కోరు వంద దాటించాడు.
తన జోరు చూస్తుంటే విండీస్ భారీ స్కోరు చేసేలా కనిపించాడు. ఈ టైమ్లో 12వ ఓవర్లో మళ్లీ బౌలింగ్కు దిగిన బుమ్రా తన మ్యాజిక్ చూపించాడు. మూడు బాల్స్ తేడాతో హెట్మయర్తో పాటు ఛేజ్ను పెవిలియన్ పంపి ఇండియాను పోటీలోకి తెచ్చాడు. వైవిధ్యమైన పేస్తో కరీబియన్లను ఇబ్బంది పెట్టాడు. హార్దిక్ వేసిన 15వ ఓవర్లో షెర్ఫానె రూథర్ఫోర్డ్ (14) కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో 100/1తో బలమైన స్థితిలో నిలిచిన విండీస్ 119/4తో ఇబ్బందుల్లో పడింది. కానీ,రోవ్మన్ పావెల్, జేసన్ హోల్డర్ కథను పూర్తిగా మార్చేశారు. పాండ్యా బౌలింగ్లోనే సిక్స్తో హోల్డర్ ఇన్నింగ్స్కు మళ్లీ తీసుకురాగా.. అర్ష్దీప్ వేసిన 17వ ఓవర్లో పావెల్ 6, 6, 4తో విజృంభించాడు.
ఎక్స్ట్రాలు సహా ఆ ఓవర్లో ఏకంగా 24 రన్స్ రావడంతో విండీస్ క్యాంప్లో జోష్ పెరిగింది. వరుణ్ బౌలింగ్లో హోల్డర్ 6, 4తో 14 రన్స్ పిండుకున్నాడు. ఆపై బుమ్రా వేసిన 18వ ఓవర్లో రెండు ఫోర్లు రావడంతో కరీబియన్ టీమ్ స్కోరు ఈజీగా 200 దాటేలా కనిపించింది. 19వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్ష్దీప్ ఆరు రన్సే ఇచ్చి కట్టడి చేశాడు. ఇక, బుమ్రా వేసిన లాస్ట్ ఓవర్లో హోల్డర్ 6.. పావెల్ 4 కొట్టడంతో విండీస్ స్కోరు 190 మార్కు దాటింది. హోల్డర్, పావెల్ ఐదో వికెట్కు 35 బాల్స్లోనే అజేయంగా 76 రన్స్ జోడించారు.
శాంసన్ ధనాధన్
ఓపెనర్ సంజూ శాంసన్ ముందుండి నడిపించడంతో భారీ టార్గెట్ను ఇండియా ఈజీగా ఛేజ్ చేసింది. ఛేజింగ్లో జట్టుకు ఆశించిన ఆరంభం లభించలేదు. పవర్ ప్లేలోనే ఇద్దరు కీలక బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. తొలి రెండు ఓవర్లలో అభిషేక్ శర్మ (10) రెండు ఫోర్లతో టచ్లోకి రాగా.. అకీల్ హుస్సేన్ వేసిన మూడో ఓవర్లో 4, 6, 6తో శాంసన్ దుమ్మురేపాడు. కానీ, అదే ఓవర్ లాస్ట్ బాల్కు పుల్షాట్ ఆడిన అభిషేక్.. హెట్మయర్కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్కు 29 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. వచ్చీరాగానే రెండు ఫోర్లతో అలరించిన ఇషాన్ కిషన్ (10)ను షార్ట్ లెంగ్త్ బాల్తో హోల్డర్ ఔట్ చేయడంతో ఇండియాకు షాక్ తగిలింది. పవర్ ప్లేను 53/2తో ముగించింది.
అప్పటికే క్రీజులో కుదురుకున్న శాంసన్.. కెప్టెన్ సూర్యకుమార్ (18) తోడుగా జట్టును ముందుకు తీసుకెళ్లారు. హోల్డర్ వేసిన ఏడో ఓవర్లోనే శాంసన్ ఫోర్, సూర్య సిక్స్ బాదడంతో ఛేజింగ్కు మళ్లీ జోష్ వచ్చింది. షెఫర్డ్ బౌలింగ్లో 6, 4.. గుడకేశ్ మోతీ ఓవర్లో ఫోర్ కొట్టిన శాంసన్ 26 బాల్స్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 17 రన్స్ వద్ద మోతీ క్యాచ్ డ్రాప్ చేయడంతో వచ్చిన చాన్స్ను సూర్య సద్వినియోగం చేసుకోలేకపోయాడు. షమర్ జోసెఫ్ వేసిన 11వ ఓవర్లో..రూథర్ఫోర్డ్కు క్యాచ్ ఇవ్వడంతో వెస్టిండీస్ రేసులోకి వచ్చేలా కనిపించింది. కానీ, శాంసన్కు తోడైన తిలక్ వర్మ కరీబియన్లకు ఆ చాన్స్ ఇవ్వలేదు. ఓ వైపు శాంసన్ తన మార్కు క్లాసిక్ షాట్లతో అదరగొట్టగా.. జోసెఫ్ వేసిన 13వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో తిలక్ ఇండియా ఫ్యాన్స్లో జోష్ తెచ్చాడు.
ఛేజ్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టడంతో ఇండియా మరో వికెట్ కోల్పోకుండానే టార్గెట్ను అందుకునేలా కనిపించింది. అంతా సాఫీగా సాగుతుందని అనుకున్న టైమ్లో 15వ ఓవర్లో తిలక్ను హోల్డర్ పెవిలియన్ చేర్చడంతో నాలుగో వికెట్కు 42 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. అప్పటికి ఇండియాకు 35 రన్స్ అవసరం అయ్యాయి.విండీస్ శిబిరంలో ఆశలు చిగురించినా.. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన శాంసన్.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (17)తో కలిసి టార్గెట్ను కరిగించాడు.19వ ఓవర్లో హార్దిక్ ఔటైనా.. దూబే (8 నాటౌట్) వరుసగా రెండు ఫోర్లతో గెలుపు ఖాయం చేశాడు. లాస్ట్ ఓవర్లో శాంసన్ 6, 4తో మ్యాచ్కు అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
స్కోర్బోర్డ్
వెస్టిండీస్: షై హోప్ (బి) వరుణ్ చక్రవర్తి 32, రోస్టన్ ఛేజ్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 40, హెట్మయర్ (సి) శాంసన్ (బి) బుమ్రా 27, రూథర్ఫోర్డ్ (సి) సంజూ శాంసన్ (బి) హార్దిక్ 14, పావెల్ (నాటౌట్) 34, హోల్డర్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 195/4;
వికెట్ల పతనం: 1–-68, 2–-102, 3-–103, 4–-119; బౌలింగ్: అర్ష్దీప్ 4--–0-–43-–0, హార్దిక్ 4–-0–-40–-1, అక్షర్ 4–-0-–35-–0, బుమ్రా 4-–0-–36-–2, చక్రవర్తి 4–-0–-40–-1.
ఇండియా: అభిషేక్ (సి) హెట్మయర్ (బి) అకీల్ హుస్సేన్ 10, శాంసన్ ( నాటౌట్) 97, ఇషాన్ (సి) హెట్మయర్ (బి) హోల్డర్ 10, సూర్యకుమార్ (సి) రూథర్ఫోర్డ్ (బి) జోసెఫ్ 18, తిలక్ (సి) హెట్మయర్ (బి) హోల్డర్ 27, హార్దిక్ (సి) హోల్డర్ (బి) జోసెఫ్ 17, దూబే (నాటౌట్) 8;
ఎక్స్ట్రాలు:12;
మొత్తం: 19.2 ఓవర్లలో 199/5;
వికెట్ల పతనం: 1–29, 2–41, 3–105, 4–141, 5–179;
బౌలింగ్: అకీల్ హుస్సేన్: 2---–0-–22–-1 , మాథ్యూ ఫోర్డ్: 3–-0–-22–-0, హోల్డర్ 4-–0-–38-–2, మోతీ 2-–0-–18–-0, షెపర్డ్ 2.2–-0-–34-–0 , షమర్ జోసెఫ్ 4-–0-–42–-2, రోస్టన్ ఛేజ్ 2–-0–-18–-0.
ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ నెగ్గేందుకు టీమిండియా మరో ముందడుగు వేసింది. సౌతాఫ్రికా చేతిలో ఓటమితో డీలా పడినా.. ఆ మ్యాచ్లో చేసిన తప్పిదాలన్నింటినీ సరి చేసుకొని నాకౌట్ రౌండ్కు చేరుకుంది. జింబాబ్వేను చిత్తుగా ఓడించిన సూర్యకుమార్ సేన క్వార్టర్ ఫైనల్ లాంటి సూపర్–8 రౌండ్ ఆఖరి పోరులో వెస్టిండీస్ పని పట్టి సెమీఫైనల్లో అడుగు పెట్టింది.
ఈ టోర్నీ ముంగిట పేలవ ఫామ్తో ఇబ్బంది పడి.. జట్టుకు భారం అనుకున్న ఓపెనర్ సంజూ శాంసన్ (50 బాల్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 నాటౌట్) కీలక పోరులో ఖతర్నాక్ ఆటతో టీమిండియా హీరో అయ్యాడు. భారీ టార్గెట్ ఛేజింగ్లో కూల్గా కామ్గా బ్యాటింగ్ చేసి తన కెరీర్లోనే బెస్ట్ అనిపించే ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. గురువారం వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
రింకూ వచ్చాడు
టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్ ఆటపై తన ప్రేమను చాటుకున్నాడు. తండ్రి చనిపోయిన రెండు రోజుల్లోనే జట్టులోకి తిరిగొచ్చాడు. రింకూ తండ్రి ఖాన్ చంద్ క్యాన్సర్ కారణంగా శుక్రవారం చనిపోయాడు. అదే రోజు అలీఘడ్ వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న రింకూ శనివారమే జట్టులో చేరాడు. విండీస్తో మ్యాచ్కు సెలెక్షన్కు అందుబాటులో ఉన్నాడు. కానీ, మేనేజ్మెంట్ తుది జట్టులో మార్పులు చేయకపోవడంతో తను బెంచ్పై కూర్చోవాల్సి వచ్చింది.
ఇదేం ఫీల్డింగ్ అభి
ఈ మ్యాచ్లో ఇండియా ఫీల్డర్లు ఓ రనౌట్ చాన్స్ సహా మూడు క్యాచ్లు డ్రాప్ చేశారు. ఇందులో రెండు అభిషేక్ శర్మనే వదిలేశాడు. ఐదో ఓవర్లో చేతుల్లోకి వచ్చిన క్యాచ్ను పట్టినట్టే పట్టి జార విడిచిన అతను విండీస్ బలమైన పునాదికి పరోక్షంగా కారణం అయ్యాడు. అక్షర్ వేసిన 13వ రూథర్ఫోర్డ్ ఇచ్చిన టఫ్ క్యాచ్ను మిడ్ వికెట్ బౌండరీ లైన్ వద్ద తిలక్ అందుకోలేకపోయాడు. బాల్ అతని చేతి వేళ్లకు తగులుతూ సిక్స్గా వెళ్లింది. అర్ష్దీప్ వేసిన 19వ ఓవర్లో పావెల్ ఇచ్చిన ఇంకో సింపుల్ క్యాచ్ను డీప్ మిడ్ వికెట్లో అభి డ్రాప్ చేశాడు. ఈ క్యాచ్లు పట్టి ఉంటే విండీస్ అంత స్కోరు చేసి ఉండేది కాదు.
- 1 టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇండియాకు ఇదే అత్యుత్తమ ఛేజింగ్. 2014లో సౌతాఫ్రికాపై చేసిన 173 రన్స్ టార్గెట్ ఛేజింగ్ను బ్రేక్ చేసింది.
- 2 టీ20 వరల్డ్ కప్లో ఇండియా తరఫున రెండో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ సంజూ శాంసన్దే (97*) . 2010లో సౌతాఫ్రికాపై రైనా 101 రన్స్ తో టాప్లో ఉన్నాడు.
- 6 ఇండియా సెమీఫైనల్ చేరడం ఇది ఆరోసారి. అత్యధికంగా ఆరుసార్లు సెమీఫైనల్ చేరిన మూడో జట్టుగా పాకిస్తాన్, ఇంగ్లండ్ రికార్డు సమం చేసింది.
- 150 టీ20ల్లో రోవ్మన్ పావెల్ కొట్టిన సిక్సర్లు. వెస్టిండీస్ తర్వాత ఈ ఫార్మాట్లో ఎక్కువ సిక్సర్లు రాబట్టిన ప్లేయర్గా నికోలస్ పూరన్ (149) రికార్డును బ్రేక్ చేశాడు.
