న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నడుం బిగించారు. గతంలో రోడ్లపై సరి-బేసి విధానంలో వాహనాలను అనుమతించిన ప్రభుత్వం.. రీసెంట్గా రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్ క్యాంపెయినింగ్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వినూత్న ప్రయోగానికి కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రీన్ మొబైల్ యాప్ పేరిట మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ యాప్లో కాలుష్య నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదు చేయొచ్చు.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గాలిలో నాణ్యత తగ్గిపోతోంది. దీంతో వాయు కాలుష్యంపై పోరాడటానికి ఆప్ సర్కార్ ఏడు పాయింట్లతో కూడిన నయా యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. ఇందులో భాగంగా యాక్షన్ ప్లాన్ను, గ్రీన్ మొబైల్ యాప్ను గురువారం విడుదల చేయనుంది. ‘యుద్ధ్ ప్రదూషన్ కే విరుద్ధ్’ పేరిట కొత్త క్యాంపెయిన్ను ఢిల్లీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనుంది. దుమ్ము, ధూళి, పొగను కంట్రోల్ చేయడంతోపాటు చెట్లను నాటడం, ఎలక్ట్రిక్ వెహికిల్స్ను ప్రోత్సహించడం లాంటి వాటిని గ్రీన్ ఢిల్లీ యాప్లో సర్కార్ జోడించింది.