- రోజుకు 5 నుంచి 7 కి.మీ. మేర చెట్లను ట్రిమ్మింగ్ చేస్తయ్
- 10 మంది కార్మికులతో చేయిస్తే 5 రోజులు పట్టే అవకాశం
హైదరాబాద్సిటీ, వెలుగు: అసలే ఔటర్రింగ్ రోడ్.. భారీ వాహనాలు, విపరీతమైన స్పీడ్లో ప్రయాణాలు. ఇటీవల అనేక వాహనాల యాక్సిడెంట్లతో ఈ రోడ్పై పనులు నిర్వహించడం అంటే ప్రమాదాలతో చెలగాటంగా మారింది. అనేక సార్లు ఇక్కడ మ్యాన్యువల్గా పనులు నిర్వహిస్తున్న టైంలో, చెట్లకు నీళ్లు పోసే టైంలో పలువురు కూలీలు, సిబ్బంది ప్రమాదాలకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ అర్బన్ఫారెస్ట్రీ అధికారులు సరికొత్త పద్ధతిలో గ్రీనరీ బ్యూటిఫికేషన్పనులకు శ్రీకారం చుట్టారు. హైట్రిమ్మర్పేరుతో ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యంత్రాలతో పనులు నిర్వహించడం చాలా సులభం. ఎక్కువ మంది మనుషులు అవసరం లేకుండా పూర్తిగా ఆటోమేటిక్గా మొక్కల ట్రిమ్మింగ్ చేయడం దీని ప్రత్యేకతగా అధికారులు తెలిపారు.
హై ట్రిమ్మర్ఎలా పని చేస్తుందంటే..
ఓఆర్ఆర్ పై మొక్కలను ట్రిమ్మింగ్ చేసే పనుల నిర్వహణకు అధికారులు హై ట్రిమ్మర్ పేరుతో ఆధునిక యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఆటోమేటిక్ మెషినరీ వల్ల మనుషుల అవసరం లేకుండా ఈ యంత్రం ద్వారానే ట్రిమ్మింగ్పనులు నిర్వహించవచ్చని అర్బన్ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్రెడ్డి గోపిడి వెల్లడించారు. ఒక్కో మెషిన్ను 10 లక్షలతో యూరప్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు వెల్లడించారు.
ఒక్కో మెషీన్రోజుకు 5 నుంచి 7 కిమీ. వరకూ మొక్కల ట్రిమ్మింగ్పనులు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పనులు మాన్యువల్గా నిర్వహించాలంటే 10 మంది మనుషులు 5 రోజులు చేయాల్సి వస్తుందన్నారు. ఇక ట్యాంకర్ల ద్వారా రోజూ మొక్కలకు నీటిని పోసేందుకు కూడా ప్రత్యేకంగా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా డ్రిప్ స్ప్రింక్లర్స్తో నీటి పోసేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ విధానం వల్ల ట్యాంకర్ల వినియోగానికి స్వస్తిచెప్పవచ్చన్నారు. ఔటర్రింగ్రోడ్ పొడవునా 158 కి.మీ. పరిధిలో అర్బన్ ఫారెస్ట్రీ సెంట్రల్ మీడియన్తోపాటు, రోడ్డుకు ఇరువైపుల మొక్కలు, చెట్లను కూడా నాటి అభివృద్ధి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానం అందుబాటులోకి తీసుకు రావడం వల్ల ప్రమాదాలను నివారించడమే కాకుండా యంత్రాల ద్వారా పనులు చేయడం వల్ల పనులు వేగంగా జరుగుతాయని అధికారులు తెలిపారు.
