గ్రీన్ ఫీల్డ్ హైవేపై .. తెగని పంచాది!.. ఉమ్మడి జిల్లాలో మొదలైన నిర్మాణ పనులు

గ్రీన్ ఫీల్డ్ హైవేపై ..  తెగని పంచాది!.. ఉమ్మడి జిల్లాలో మొదలైన నిర్మాణ పనులు
  • కొన్నిచోట్ల భూసేకరణకు తొలగని అడ్డంకులు
  • పరిహారం తక్కువంటూ కోర్టుకెళ్లిన 46 మంది రైతులు
  • ఇప్పటికే 912 మందికి రూ.49.5 కోట్లు చెల్లింపు
  • మరో 283 మందికి రూ.6.47 కోట్ల వరకు పెండింగ్
  • పూర్తి పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని నిర్వాసితుల డిమాండ్

హనుమకొండ/పరకాల, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి విజయవాడ వరకు నిర్మిస్తోన్న గ్రీన్​ ఫీల్డ్​ హైవే(ఎన్​హెచ్​--–163జీ) పనులకు అడ్డంకులు పూర్తిగా తొలగలేదు. కొన్నిచోట్ల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు నిర్వాసితులకు పరిహారం చెల్లించారు.  మరికొన్ని చోట్ల తమకు ప్రభుత్వ ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు అభ్యంతరం చెబుతున్నారు.  

కొందరు రైతులు కోర్టుకు వెళ్లడంతో,  సమస్యలు లేని ప్రాంతాల్లో గ్రీన్​ ఫీల్డ్​ హైవే నిర్మాణ పనులు మొదలయ్యాయి. ముందుగా ట్రెంచ్​వర్క్స్ చేపట్టగా.. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండానే పనులు ఎలా చేస్తారని అధికారులను భూ నిర్వాసిత రైతులు ప్రశ్నిస్తున్నారు. దీంతో గ్రీన్​ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులపై గందరగోళం నెలకొంది.

74.2 ఎకరాలు పెండింగ్

కేంద్రం భారత్ మాల పరియోజనలో భాగంగా మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల మీదుగా ఏపీలోని విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టింది. 577 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనుండగా.. మంచిర్యాల నుంచి విజయవాడ రూట్ లో భాగంగా 1,157 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం నుంచి ఆత్మకూరు మండలం పెద్దాపూర్ వరకు 28 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనుండగా, 1,195 రైతుల నుంచి 141 హెక్టార్ల(349.2 ఎకరాల) భూమిని సేకరించాల్సి ఉంది.

ఇప్పటివరకు 912 మంది నుంచి 275 ఎకరాలు(111.2 హెక్టార్లు) సేకరించిన అధికారులు ఆర్బిట్రేషన్ ద్వారా రూ.49.57 కోట్లు పరిహారం చెల్లించారు. ఇంకో 283 మంది నుంచి 74.2 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. వారికి రూ.6.47 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంది. 

రూ. కోట్లలో ధర పలుకుతుంటే..

గ్రీన్​ ఫీల్డ్​ హైవే లో భూములు కోల్పోతున్న రైతులు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని మొదట్నుంచీ డిమాండ్​చేస్తున్నారు. భూములు రూ.కోట్లలో ధర పలుకుతుంటే, అధికారులు భూసేకరణ చట్టం – 2013 ప్రకారం పరిహారం చెల్లిస్తామనడంతో కొందరు రైతులు నాలుగేండ్ల నుంచి అభ్యంత రాలు, ఆందోళన లు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే 46 మంది గతంలోనే కోర్టును ఆశ్రయించారు. ఇంకా 74.2 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, కుటుంబ సమస్యలు, పట్టా పాస్​బుక్ లు లేకపోవడం సమస్యగా మారినట్లు తెలిసింది.

ట్రెంచ్ పనులను అడ్డుకుని..

హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం, వెంకటాపురం, మల్లక్కపేట, మాధారం, వెల్లంపల్లి, పోచారం, దామెర మండలం పులుకుర్తి, పసరగొండ, ఊరుగొండ, ముస్త్యాలపల్లి, శాయంపేట మండలం గట్లకనిపర్తి, ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్, పెద్దాపూర్ గ్రామాల శివారుమీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తోంది. ఇప్పటికే హైవే నిర్మాణానికి అవార్డు చేసిన ప్రకారం ఆఫీసర్లు పరిహారం చెల్లించిన ప్రాంతాల్లో ట్రెంచ్​పనులు మొదలు పెట్టారు.  పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకుండానే ఎలా చేస్తారంటూ నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నెల 11న దామెర మండలం ఊరుగొండ వద్ద ట్రెంచ్​పనులు స్టార్ట్ చేయగా, తమకు పరిహారం చెల్లించకుండా చేపట్టొద్దంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇకనైనా ప్రభుత్వం బహిరంగ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని నిర్వాసిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మార్కెట్ వ్యాల్యూలో 50 శాతం కూడా ఇస్తలేరు

హైవే నిర్మాణానికి గుర్తించిన భూములకు బహిరంగ మార్కెట్ వ్యాల్యూలో 50 శాతం పరిహారం కూడా ఇవ్వడం లేదు. దామెర మండలం ఊరుగొండ వద్ద ఐదారు కోట్లు పలుకుతున్న భూమికి రూ.88 లక్షలు ఇస్తామంటున్నారు.  మార్కెట్ రేట్ చెల్లించే వరకు న్యాయంగా కొట్లాడుతాం. - బూర్గుల రాంచందర్, గట్ల కానిపర్తి

రైతులు సహకరించాలి

భూసేకరణలో టైటిల్స్ ఇచ్చిన రైతులకు ఎప్పటికప్పుడూ పరిహారం చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు 912 మందికి అందించాం. చిన్న చిన్న సమస్యలతో కొంత మందికి టైటిల్స్ ఇవ్వలేదు. వాటిని కూడా పరిష్కరించి, తొందరలోనే భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం. రైతులు సహకరించాలి. - కె.నారాయణ, ఆర్డీవో, పరకాల