ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత అత్తగారి ఇంట్లో సంతోషంగా ఉండాలని కలలు కంటుంది, కానీ ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్లోని ఒక అమ్మాయికి ఈ కల కాస్ట్లీ గా మారింది. వధువు కలను చెడగొట్టిన వ్యక్తి మరెవరో కాదు, ఆమెకు కాబోయే వరుడు. అయితే వధువు తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెకి కాబోయే భర్త, అతని కుటుంబంపై అత్యాచారం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు, దర్యాప్తులో తేలిన సాక్ష్యాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం ఘజియాబాద్లోని నాగర్ కొత్వాలి ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువతికి ఘజియాబాద్లోని సాహిబాబాద్ ప్రాంతంలోని కర్హేరా కాలనీ నివాసి ఆయిన అంకుర్ చౌహాన్తో నిశ్చితార్థం జరిగింది. నవంబర్ మొదటి వారంలో వీరి వివాహం జరగాల్సి ఉంది. వధూవరులు కుటుంబీకులు పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది.
అక్టోబర్ 24న అంకుర్ కుటుంబ సభ్యులు వధువు తండ్రికి ఫోన్ చేసి మోహన్ నగర్లోని ఒక మాల్లో కలవాలని చెప్పారు. కుటుంబ సభ్యులందరూ మాల్కు వెళ్లగా అంకుర్ కుటుంబం మీతో పెళ్లి కుదుర్చుకోలేము అని చెప్పి షాక్ ఇచ్చింది. దింతో పెళ్లి ఎందుకు రద్దు చేస్తున్నారని అడగగా అంకుర్ నేరుగా అమ్మాయి వైపు నుండి నా డిమాండ్లు తీర్చకపోతే పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు.
నిజానికి, పెళ్లి కోసం ఇప్పటికే రూ. 60 లక్షల కట్నం, ఖరీదైన కారు ఇవ్వాలని నిర్ణయం జరిగింది. కారును బుక్ కూడా చేశారు. అయినా సరే, అంకుర్ అదనంగా కట్నం డిమాండ్ చేయడంతో అమ్మాయి కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. పెళ్లి ఆగిపోకుండా ఉండేందుకు వధువు ఎంత ప్రయత్నించినా అంకుర్ వినలేదు. దాంతో అంకుర్ చేసిన మోసం గురించి ఆమె తన కుటుంబానికి చెప్పింది.
వీరి మధ్య ప్రేమ, నమ్మకం బలపడటంతో పెళ్లికి ముందే ఒక్కటయ్యామని, అంకుర్ పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్టోబర్ 1న నోయిడాలోని ఒక ఫ్లాట్కు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి తాను అంగీకరించానని కూడా తెలిపింది. దింతో వధువు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అంకుర్ చౌహాన్పై అత్యాచారం, వరకట్న నిషేధ చట్టం కింద కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
