
- గ్రూప్_4 ఉద్యోగులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గందరగోళ పరిస్థితి
- జాబ్లో చేరినా ఐడీ ప్రాన్ కేటాయించని అధికారులు
- ఉన్నతాధికారులు సమస్య పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులు
మహబూబాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొంది ఏడు నెలలు గడిచిపోయినా నేటికీ వారికి వేతనాలు అందడం లేదు. నోటిఫికేషన్ సమయంలో చూపించిన పోస్టులు ఉద్యోగంలో చేరే నాటికి లేకపోవడంతో కొత్త ఉద్యోగులు కంగుతింటున్నారు. దీంతో ఎట్టకేలకు అపాయింట్మెంట్ ఆర్డర్ తో ఉద్యోగంలో చేరినా ఆ ఆరుగురు ఉద్యోగులకు ఇప్పటికీ గుర్తింపు నంబర్, ప్రాన్ ఐడీ కేటాయించడం లేదు. అధికారుల తప్పిదం ఉద్యోగులకు శాపంగా మారింది.
ఆఫీసర్ల తప్పిదం..
ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ కు ముందు వివిధశాఖల్లోని ఖాళీల వివరాలను జిల్లా అధికారులు టీజీపీఎస్సీకి అందించారు. ఇందులో భాగంగానే 2022 డిసెంబర్ 1న గ్రూప్–4 నోటిఫికేషన్కు ముందు జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో 152 పోస్టులకు గ్రూప్–4 ద్వారా నియామకం చేశారు. 7 మే 2022లో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి పోస్టులు ఫిలప్ చేయవద్దని డైరెక్టర్ ఆఫ్పబ్లిక్హెల్త్, కుటుంబసంక్షేమ అధికారిక ఉత్తర్వులు జారీ చేసినా మహబూబాబాద్ జిల్లాలో కారుణ్య నియామకాల కింద 2023 డిసెంబర్ లో ఆరుగురిని నూతనంగా భర్తీ చేశారు. ఈ సమయంలో నాటి డీఎంహెచ్వో కలెక్టర్ అనుమతి లేకుండా, రోస్టర్ఆఫ్రిజర్వేషన్పాటించకుండా ఇష్టానుసారంగా అభ్యర్థుల నుంచి ముడుపులు పొంది హడావుడిగా పోస్టులను భర్తీ చేశారనే ఆరోపణలున్నాయి.
ఉద్యోగ ఖాళీల్లో కారుణ్య నియామకం ద్వారా వచ్చిన వారితో భర్తీ చేయడంతో సమస్య వచ్చింది. గ్రూప్-–4 ద్వారా ఎంపికై డీఎంహెచ్ వోకు కేటాయించిన ఆరుగురిలో 2024 డిసెంబర్18న ఐదుగురు జాయిన్ అయినా వారికి ఇప్పటి వరకు ఏడు నెలలైనా ఐడీ, ప్రాన్ ఇవ్వలేదు. కొత్త పోస్టులు క్రియేట్ చేయాలంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ నుంచి పర్మిషన్, కలెక్టర్ అనుమతి ఉండాలని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన తమ సమస్యలపై అధికారులు స్పందించడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గతంలో కారుణ్య నియామకాలు పొందిన వారికి సైతం 3 నెలలుగా వేతనాలు నిలిపివేశారు. మొత్తంగా 11 మంది ఉద్యోగుల సమస్య పరిష్కారం కావలసి ఉంది.
సమస్య పరిష్కారానికి చర్యలు..
గతంలో వైద్యారోగ్య శాఖలో కారుణ్య నియామకాల కింద 6 పోస్టులను భర్తీ చేసిన సమయంలో సరియైన మార్గదర్శకాలు పాటించలేదనే విమర్శలు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు నివేదించనున్నాం. కొత్తగా గ్రూప్_4 ద్వారా రిక్రూట్ అయిన ఐదుగురు ఉద్యోగుల సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాం. నేను కొత్తగా బాధ్యతలను చేపట్టడంతో సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. - రవిరాథోడ్, డీఎంహెచ్వో, మహబూబాబాద్ జిల్లా