రేపు నింగిలోకి జీశాట్‌-30

రేపు నింగిలోకి జీశాట్‌-30

ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాలకు జీశాట్‌-30తో బోణీ కొట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. దేశ ఇంటర్నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక జీశాట్‌-30 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. దక్షిణ అమెరికా ఫ్రెంచ్‌ గయానాలోని యూరోపియన్‌ స్పేస్‌ పోర్టు నుంచి ఆ దేశానికే చెందిన ఎరియన్‌-5 రాకెట్‌ ద్వారా దీన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

భారత కాలమానం ప్రకారం 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ రాకెట్‌ జీశాట్‌-30తో నింగిలోకి దూసుకెళ్లనుంది. స్పేస్‌ పోర్టులోని 3వ ఎరియన్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి ఈ ప్రయోగం జరగనున్నట్టు ఇస్రో తెలిపింది. ఇవాళ(గురువారం) మధ్యాహ్నం 3.12 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఫ్రెంచ్‌ గయానాకు చేరుకుని వాహక నౌకలో జీశాట్‌-30 ఉపగ్రహాన్ని అనుసంధానం చేశారు.

జీశాట్ బరువు సుమారు 3,357 కిలోలు. ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. జీశాట్ బరువు సుమారు 3357కిలోలు. ఐ-3కే ప్లాట్‌ఫామ్‌లో దీన్ని తయారు చేశారు. ఇన్శాట్-4Aకు ప్రత్యామ్నాయంగా జీశాట్-30 పనిచేయనుంది. భారత్‌తో పాటు అనుబంధ దేశాలకు ఈ శాటిలైట్ ద్వారా కేయూ బ్యాండ్లో సిగ్నల్ అందించనుండగా, గల్ఫ్ దేశాలకు సీ బ్యాండ్ ద్వారా కవరేజ్ ఇవ్వనున్నారు. ఆసియాలో కొన్ని దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు కూడా సీ బ్యాండ్ ద్వారా సేవలు అందిస్తారు.దీని ద్వారా టెలివిజన్‌, టెలీకమ్యూనికేషన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.