వీడియో: కళ్లు దొబ్బాయా..! అంపైర్‌పైకి దూసుకెళ్లిన గిల్

వీడియో: కళ్లు దొబ్బాయా..! అంపైర్‌పైకి దూసుకెళ్లిన గిల్

బుధవారం(ఏప్రిల్ 10) జైపూర్‌ వేదికగా గుజరాత్ vs రాజస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇప్పటికే రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని నెటిజన్లు ఆరోపిస్తుండగా.. తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠకు దారితీసిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహనం కోల్పోయాడు. కోపంతో ఏకంగా అంపైర్ పైకే దూసుకెళ్లాడు.

రాజస్తాన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో మోహిత్ శర్మ వేసిన చివరి బంతి ఆఫ్ స్టంప్ అవతల వెళ్లింది. దీంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ వైడ్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై గుజరాత్ కెప్టెన్ గిల్ సమీక్ష కోరగా.. థర్డ్ అంపైర్ మొదట ఆ బంతి సరైనదిగా తేల్చాడు. బ్యాటర్ (శాంసన్) ఆఫ్ స్టంప్ వైపు జరగడంతో వైడ్ కాదని వివరణ ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని సెకన్ల అనంతరం థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన దానికి కట్టుబడి వైడ్‌గా ప్రకటించారు. ఇదే గిల్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. కోపంతో ఊగిపోయిన అతను.. ఫీల్డ్ అంపైర్ దగ్గరికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read :ట్రెంట్ బౌల్ట్ ఎందుకు బౌలింగ్ చేయలేదు? RR vs GT మ్యాచ్‌పై అనుమానాలు!

ఇక, ఈ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 196 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో గుజరాత్ ఆఖరి బంతికి గెలుపొందింది. విజయానికి చివరి 12 బంతుల్లో 35 పరుగులు అవసరం కాగా, శుభ్‌మన్ గిల్ సేన దాన్ని చేధించింది. ఆఖరిలో రాహుల్‌ తెవాటియా(11 బంతుల్లో 22), రషీద్‌ ఖాన్‌(11 బంతుల్లో 24) జోడి నిలకడగా ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. రషీద్‌ చివరి బంతికి ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.