
- క్వాలిఫయర్-2కు ఇండియన్స్ .. జీటీ ఫట్టు ముంబై హిట్టు
- ఎలిమినేటర్లో ఓడిన గుజరాత్
- దంచికొట్టిన రోహిత్ శర్మ
- బుమ్రా సూపర్ బౌలింగ్
- సుదర్శన్, సుందర్ పోరాటం వృథా
ముల్లన్పూర్: ఐపీఎల్లో ఆరో టైటిల్పై గురి పెట్టిన ముంబై ఇండియన్స్ ఆ దిశగా కీలక అడుగు వేసింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (50 బాల్స్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 81) ఖతర్నాక్ ఇన్నింగ్స్తో దంచికొట్టడంతో గుజరాత్ టైటాన్స్ను ఎలిమినేట్ చేసిన ముంబై క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. భారీ టార్గెట్ ఛేజింగ్లో సాయి సుదర్శన్ (49 బాల్స్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 80), వాషింగ్టన్ సుందర్ (24 బాల్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 48) ధనాధన్ బ్యాటింగ్తో ఆశలు రేపినా.. చివర్లో తడబడిన టైటాన్స్ ఇంటిదారి పట్టింది.
రోహిత్ మెరుపులకు తోడు జస్ప్రీత్ బుమ్రా (1/27) సూపర్గా బౌలింగ్ చేయడంతో శుక్రవారం జరిగిన ఎలిమిటేటర్ మ్యాచ్లో ముంబై 20 రన్స్ తేడాతో జీటీని ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 228/5 స్కోరు చేసింది. జానీ బెయిర్స్టో (22 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47) కూడా రాణించాడు. జీటీ బౌలర్లలో సాయి కిశోర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్లో జీటీ ఓవర్లన్నీ ఆడి 208/6 స్కోరు చేసి ఓడిపోయింది. రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆదివారం జరిగే క్వాలిఫయర్2లో పంజాబ్ కింగ్స్తో ముంబై తలపడనుంది.
రోహిత్ ధనాధన్..
టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన ముంబై రోహిత్ సూపర్ ఇన్నింగ్స్తో భారీ స్కోరు చేసింది. 3,12 రన్స్ వద్ద క్యాచ్ డ్రాప్లతో లైఫ్ దక్కించుకున్న హిట్మ్యాన్ జీటీ బౌలింగ్ను ఉతికేశాడు. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో రోహిత్ టచ్లోకి రాగా... ప్రసిధ్ వేసిన నాలుగో ఓవర్లో కొత్త ఓపెనర్ బెయిర్స్టో 6, 4, 6, 6, 4తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆరో ఓవర్లో స్పిన్నర్ సాయి కిశోర్కు రోహిత్ రెండు ఫోర్లు, సిక్స్తో వెల్కం చెప్పడంతో పవర్ ప్లేను ముంబై 79/0 స్కోరుతో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత గుజరాత్ బౌలర్లు పుంజుకునే ప్రయత్నం చేశారు. ఏడో ఓవర్లో రషీద్ ఖాన్ మూడే రన్స్ ఇవ్వగా.. తర్వాతి ఓవర్లో బెయిర్స్టోను ఔట్ చేసిన కిశోర్ తొలి వికెట్కు 84 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. కానీ, ఈ ఆనందం ఎంతోసేపు నిలువలేదు.
రోహిత్కు ఇన్ఫామ్ బ్యాటర్ సూర్యకుమార్ (33) తోడయ్యాడు. రషీద్ బౌలింగ్లో 4, 6.. కిశోర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ 28 బాల్స్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి 13 బాల్స్లో 13 రన్స్ మాత్రమే చేసిన సూర్య.. కొయెట్జీ వేసిన 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో స్పీడు పెంచాడు. సాయికిశోర్ బౌలింగ్లో మరో సిక్స్ కొట్టిన సూర్య.. ఇంకో షాట్కు ట్రై చేసి సుందర్కు క్యాచ్ ఇవ్వడంతో రెండో వికెట్కు 59 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. అయినా రోహిత్ తన ధాటిని కొనసాగించగా.. తిలక్ వర్మ (25) కూడా భారీ షాట్లు ఆడాడు. చివర్లో జీటీ బౌలర్లు కొంచెం మెరుగయ్యారు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేశాడు. తిలక్ను సిరాజ్ వెనక్కుపంపగా, రషీద్ పట్టిన క్యాచ్కు నమన్ ధీర్ (9) ఔటయ్యాడు. కానీ, కొయెట్జీ వేసిన చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా (9 బాల్స్లో 22 నాటౌట్) మూడు సిక్సర్లు సహా 22 రన్స్ రాబట్టి స్కోరు 220 దాటించాడు.
సుదర్శన్, సుందర్ పోరాడినా..
భారీ టార్గెట్ ఛేజింగ్లో జీటీకి స్టార్టింగ్లో ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్లో ఉన్న కెప్టెన్ గిల్ (1)ను ఇన్నింగ్స్ నాలుగో బాల్కే ఎల్బీ చేసిన బౌల్ట్ షాకిచ్చాడు. కానీ, ఇంకో ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం తన ఫామ్ కొనసాగించాడు. బౌల్ట్ బౌలింగ్లోనే సిక్స్తో స్పీడు పెంచగా.. వన్డౌన్లో వచ్చిన కుశాల్ మెండిస్ (20) వరుసగా రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. గ్లీసన్, హార్దిక్, బుమ్రా ఓవర్లలో వరుసగా రెండేసి ఫోర్లు బాదిన సుదర్శన్ పవర్ ప్లేను 66/1తో ముగించాడు. కానీ, స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ పుల్ షాట్కు ట్రై చేసిన కుశాల్ హిట్ వికెట్గా వెనుదిరిగాడు.
అయినా సుదర్శన్ వెనక్కు తగ్గలేదు. అదే ఓవర్లో రెండు ఫోర్లు బాదిన అతను వాషింగ్టన్ సుందర్ జతగా పది ఓవర్లకే స్కోరు వంద దాటించాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత సుందర్ కూడా బ్యాట్కు పని చెప్పాడు. హార్దిక్ బౌలింగ్లో ఫోర్, సిక్స్తో స్పీడందుకున్నాడు. బౌల్ట్ ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టడంతో చూస్తుండగానే స్కోరు 150 దాటింది. కానీ, 14వ ఓవర్లో మళ్లీ బౌలింగ్కు దిగిన బుమ్రా అద్భుతమైన యార్కర్తో సుందర్ను బౌల్డ్ చేసి నాలుగు రన్సే ఇచ్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు.
మూడో వికెట్కు 84 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అవడంతో ముంబై తిరిగి రేసులోకి వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రూథర్ఫోర్డ్ (24) వెంటవెంటనే మూడు ఫోర్లు కొట్టినా.. గ్లీసన్ బౌలింగ్లో స్కూప్ షాట్కు ట్రై చేసిన సుదర్శన్ బౌల్డ్ అవ్వడంతో జీటీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. చివరి నాలుగు ఓవర్లలో ఆ టీమ్కు 54 రన్స్ అవసరం అయ్యాయి. అశ్వని కుమార్ బౌలింగ్లో ఫోర్, బుమ్రా వేసిన 18వ ఓవర్లో సిక్స్ కొట్టిన రాహుల్ తెవాటియా (16 నాటౌట్) సమీకరణాన్ని 12 బాల్స్లో 36 రన్స్గా మార్చాడు. కీలకమైన 19వ ఓవర్లో తొలి బాల్కే రూథర్ఫోర్డ్ను క్లీన్బౌల్డ్ చేసిన బౌల్ట్ మ్యాచ్ను ముంబై వైపు తీసుకెళ్లాడు. ఆరో బాల్కు షారూక్ ఖాన్ (13) సిక్స్ కొట్టాడు. చివరి ఓవర్లో జీటీకి 24 రన్స్ అవసరం అవగా 3 మాత్రమే చేసిన గుజరాత్ ఓడిపోయింది.
సంక్షిప్త స్కోర్లు
- ముంబై: 20 ఓవర్లలో 228/5 (రోహిత్ 81, బెయిర్స్టో 47, సాయి కిశోర్ 2/42).
- గుజరాత్: 20 ఓవర్లలో 208/6 (సుదర్శన్ 80, సుందర్ 48, బౌల్ట్ 2/56, బుమ్రా 1/27)