
హైదరాబాద్, వెలుగు: అనుమతి లేకుండా చెట్లు నరికివేయడంతో కూకట్పల్లి పరిధిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీపై అటవీ శాఖ అధికారులు కొరడా ఝలిపించారు. కంపెనీ యాజమాన్యానికి భారీగా జరిమానా విధించారు. గతవారం ఆ కంపెనీ పరిధిలో చెట్లు నరికివేయడంతో అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీనిపై డిపార్ట్ మెంట్ అధికారులు విచారణ చేపట్టగా.. అనుమతులు లేకుండా చెట్లు నరికి వేసినట్టు తేలింది.
దీంతో ఆ కంపెనీ యాజమాన్యానికి రూ.20 లక్షలు జరిమానా విధించారు. ఆ ఫైన్ ను సోమవారం కంపెనీ ప్రతినిధులు చెల్లించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా డీఎఫ్వో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఎవరైనా చెట్లను నరికివేస్తే కఠిన చర్యలు ఉంటాయని, జరిమానాతోపాటుగా కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.