Gold: బిర్లాల దగ్గరే బంగారం కొట్టేసిన కేటుగాళ్లు : సైబర్ ఎటాక్ చేసింది ఎవరు.. ఏ దేశం నుంచి..?

Gold: బిర్లాల దగ్గరే బంగారం కొట్టేసిన కేటుగాళ్లు : సైబర్ ఎటాక్ చేసింది ఎవరు.. ఏ దేశం నుంచి..?

Aditya Birla Capital: దొంగలకు బయపడి ప్రజలు డిజిటల్ రూపంలో ఆస్తులను దాచుకుంటుంటే ప్రస్తుతం వాటికి కూడా రక్షణ కొరవడుతోంది. ప్రపంచం మెుత్తం టెక్నాలజీపై నడుస్తున్న ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు కళ్లకు కనిపించకుండానే దొంగతనాలు చేసేస్తున్నారు. అయితే తాజాగా బిర్లా సంస్థ కూడా సైబర్ నేరగాళ్ల అటాక్ కి గురైందని వెల్లడైంది.

తాజాగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ డిజిటల్ లిమిటెడ్ యాప్ పై సైబర్ దాడి జరిగింది. యాప్ సిస్టమ్ లకు యాక్సెస్ పొందిన హ్యాకర్లు సంస్థలోని 435 కస్టమర్ల ఖాతాల నుంచి రూ.కోటి 95 లక్షలు విలువైన డిజిటల్ బంగారాన్ని అమ్మేశారని వెల్లడైంది. చాలా మంది కస్టమర్లు తమ ఖాతాల నుంచి బంగారం తమ అనుమతి లేకుండానే విక్రయించబడిందని కంపెనీని సంప్రదించటంతో సైబర్ అటాక్ బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన కంపెనీ టెక్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇందులో సెక్యూరిటీ బ్రీచ్ జరిగినట్లు వారు గుర్తించారు. 

సైబర్ దాడి వల్ల ప్రభావితం అయిన ఖాతాల్లో డిజిటల్ గోల్డ్ హోల్డింగ్స్ తిరిగి అందించబడ్డాయని కంపెనీ వెల్లడించింది. తమ ఫ్లాట్ ఫారంలో డిజిటల్ గోల్డ్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, సెక్యూరిటీ బ్రీచ్ తమ టీమ్ ఫిక్స్ చేసిందని కంపెనీ స్పష్టం చేసింది. తాము సరైన పద్ధతులను అవలంభించి డబ్బును నేరగాళ్లు వివిధ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించకుండా అడ్డుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

సైబర్ నేరగాళ్లు సంస్థ యాప్ ను సర్వర్లతో కనెక్ట్ చేసే ఏపీఐపై దాడిచేసినట్లు కంపెనీ గుర్తించింది. ఈ టెక్నికల్ లింక్ ద్వారా హ్యాకర్లు ఓటీపీ వెరిఫికేషన్ సెక్యూరిటీ లేయర్ దాటి బంగారాన్ని విక్రయించగలిగారని గుర్తించింది. ప్రస్తుతానికి ఈ సైబర్ దాడి చేసింది ఎవరు ఎక్కడి వారు అనే వివరాలను కనుక్కునే పనిలో ముంబై సైబర్ సెల్ అధికారులు ఉన్నారు. కస్టమర్లు యాప్ ద్వారా బంగారం వెండి కొనుగోలు, మ్యూచువల్ ఫండ్స్, యూపీఐ సేవలు, ఇన్సూరెన్స్ కొనుగోలు వంటి సేవలను అందిస్తోంది.