ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో ఆదివారం చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించారు. చీఫ్ గెస్టుగా ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ డీఈ చంద్రకాంత్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ.. ప్రజలు చేనేత వస్త్రాలను ఆదరించాలని కోరారు. మార్కెట్ లో కంటే తక్కువ ధరకే ఈ స్టాల్స్ లో బట్టలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పొందిన కార్మికులు ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హ్యండ్లూమ్స్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ డీఎం రాజేశ్, ఎస్సై తాజుద్దీన్, సర్పంచ్ డోళి రజిత, సీఏ మల్లేశ్ తదితరులున్నారు.

కబ్జాల్లో ఆరితేరిన టీఆర్ఎస్ కొండేటి శ్రీధర్

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ లీడర్ల కబ్జాలే కనిపిస్తున్నాయని, ఆఖరికి మంద క్రిష్ణ మాదిగ భూమికి సైతం ఎసరు పెట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఆరోపించారు. ఆదివారం వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల భూములకు టీఆర్ఎస్ నేతలు దొంగ పత్రాలు సృష్టించి, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలిపారు. వరంగల్ సిటీలోని మంద క్రిష్ణ మాదిగ భూమిని, ఎమ్మెల్యే అరూరి రమేశ్​అనుచరుడు కబ్జా చేశాడని ఆరోపించారు. టీఆర్ఎస్ లీడర్ల ఆక్రమణలకు అంతులేకుండా పోయిందన్నారు. ఆఫీసర్లు స్పందించి, కబ్జాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కు మంత్రి, ఎంపీ కృతజ్ఞతలు

మహబూబాబాద్​అర్బన్, వెలుగు: ఎస్టీల రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతానికి పెంచిన సీఎం కేసీఆర్​కు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు. బొకే ఇచ్చి, గిరిజనుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తాం

హన్మకొండ సిటీ, వెలుగు: వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తామని మణికంఠ స్వీట్స్ ఓనర్  పెద్ది సంధ్య తెలిపారు. ఆదివారం హనుమకొండలోని హంటర్ రోడ్ లో మణికంఠ స్వీట్స్ షాప్ ను ఆయన ప్రారంభించారు. మార్కెట్ కు తగ్గట్టుగా ఉత్పత్తులను తయారు చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గాయత్రి, శబరీశ్​తదితరులున్నారు.

సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి

కాశిబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: వరంగల్ సిటీలో సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేయర్ గుండు సుధారాణి చెప్పారు. ఆదివారం భద్రకాళి ఆలయ ప్రాంతంలో బతుకమ్మల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన నీటి కొలనును పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలి ఉన్న పనుల్ని ఆఫీసర్లు  వెంటనే కంప్లీట్ చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్​ విజయలక్ష్మి, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ రవికుమార్, ఏఈ విజయలక్ష్మి తదితరులున్నారు.

పీఏసీఎస్ చైర్మన్ పై తిరగబడ్డ డైరెక్టర్లు అవినీతిపై విచారణకు డిమాండ్‌‌ 

చర్యలు తీసుకోకపోతే మూకుమ్మడి రాజీనామా!

శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లా శాయంపేట పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్ అక్రమాలపై విచారణ జరిపించాలని వైస్‌‌ చైర్మన్‌ దూదిపాల తిరుపతిరెడ్డితో పాటు మరో 8మంది డైరెక్టర్లు డిమాండ్ చేశారు. లేదంటే తాము మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆదివారం శాయంపేటలో వారు మీడియాతో మాట్లాడారు. పీఏసీఎస్‌‌ చైర్మన్ కుసుమ శరత్‌ ఒంటెత్తు పోకడలకు పోతున్నారని, గత మూడేళ్లుగా లెక్కలు చూపించడం లేదని ఆరోపించారు. డీసీసీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు.. సొసైటీకి రూ.30లక్షల క్రాప్ లోన్లు మంజూరు చేయగా.. రూ.25లక్షలు మాత్రమే సాంక్షన్ అయ్యాయని చూపించారని పేర్కొన్నారు.

అది కూడా చివరి క్షణంలో తెలపడంతో లోన్లు ల్యాప్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకాల మార్కెట్ ద్వారా అందిన టార్పాలిన్ కవర్లను సైతం అమ్ముకుని అవినీతికి పాల్పడ్డాడని ధ్వజమెత్తారు. సొసైటీ సీఈవోలను మానసికంగా వేధించడంతో ఒకరు ఆత్మహత్య కూడా చేసుకున్నారని తెలిపారు. కొత్త సీఈవో నియామకంలోనూ లంచాలు తీసుకున్నాడని ఆరోపించారు. శరత్ చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. సమావేశంలో పీఏసీఎస్‌‌ డైరెక్టర్లు ఎలమంచి జైపాల్ రెడ్డి, మంద మల్లయ్య, వాంకుడోత్ సదర్‌లాల్, తోట శ్రీనివాస్, బగ్గి రమేశ్, చాడ మహేందర్ రెడ్డి, బూర రమేశ్, దైనంపల్లి వసంత తదితరులున్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

హనుమకొండ సిటీ, వెలుగు: సీఎం కేసీఆర్ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సుబేదారిలో వారు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో విద్యారంగానికి 12శాతం బడ్జెట్ కేటాయిస్తే.. తెలంగాణలో 6.3శాతం మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. చాలా చోట్ల డీఈవోలు, ఎంఈవోలు కూడా లేరని తెలిపారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లలో సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

ఎల్కతుర్తి , వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కోలా రామేశ్వరం గౌడ్ ఇటీవల మృతి చెందగా.. బాధిత కుటుంబాన్ని ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేదల కోసం రామేశ్వరం కొట్లాడిన తీరును కుటుంబసభ్యులు వివరించారు. సర్పంచ్ రాముడు తదితరులున్నారు.