
- ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న ఆఫీసర్లు
- లక్షణాలున్న వారికి టెస్టులు, మెడిసిన్ అందజేత
- ఏడాది చివరి నాటికి వ్యాధిని కంట్రోల్ చేసేలా ప్లాన్
- హనుమకొండను టీబీ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు అడుగులు
హనుమకొండ, వెలుగు: జిల్లాలో క్షయవ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యాధి లక్షణాలున్నా ముందుగా గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ తదితర కారణాల వల్ల టీబీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విస్తరిస్తున్న క్షయ వ్యాధిని కంట్రోల్ చేయడంతోపాటు దానిని పూర్తిగా అంతం చేసి 'టీబీ ఫ్రీ ఇండియా'ను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే నిర్వహించింది. అక్కడ సత్ఫలితాలు రావడంతో ఇప్పుడు హనుమకొండ జిల్లాలో కూడా సర్వే ప్రారంభించారు. వంద రోజులపాటు సర్వే నిర్వహించి, టీబీ వ్యాధిగ్రస్తులు, ఆ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వ్యాధి వ్యాప్తిచెందకుండా తగిన చర్యలు షురూ చేశారు.
వంద రోజులపాటు సర్వే..
క్షయ వ్యాధికి అడ్డుకట్ట వేయడంతోపాటు దాని బారిన పడే అవకాశం ఉన్నవారిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడేండ్ల కిందట ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ అభియాన్ చేపట్టింది. ఈ మేరకు 2025 చివరినాటికి టీబీ వ్యాధిని అంతం చేసేందుకు ప్రణాళికలు రచించింది. అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోవడంతో గతేడాది చివర్లో దేశ వ్యాప్తంగా 347 జిల్లాలను పైలట్ ప్రాజెక్టు జిల్లాలుగా ఎంపిక చేసి, వంద రోజులపాటు సమగ్ర సర్వే నిర్వహించింది. మొదటి దశలో రాష్ట్రంలో ఎంపిక చేసిన ఈ తొమ్మిది జిల్లాల్లో గతేడాది డిసెంబర్ 21 నుంచి వంద రోజుల పాటు సర్వే చేశారు.
దాదాపు 7 వేల మందికిపైగా అనుమానితులకు న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్టులు నిర్వహించి, 181 మందికి టీబీ పాజిటివ్ గా నిర్ధారించారు. వారికి అవసరమైన మందులు అందించడంతోపాటు నిక్షయ్ పోషణ్ యోజన కింద ప్రతి నెలా రూ.వెయ్యి అందించేందుకు చర్యలు చేపట్టారు. పైలట్ప్రాజెక్టు జిల్లాల్లో సర్వే అనంతరం రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. దీంతో టీజీ నియంత్రణ, వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లు జిల్లాలో సర్వే చేపడుతున్నారు.
ఇంటింటికీ టెస్టులు..
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సర్వే పూర్తికాగా, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని భీమారంలో సోమవారం సర్వే స్టార్ట్ చేశారు. జిల్లాలో 17 పీహెచ్సీలు, 7 అర్బన్హెల్త్ సెంటర్లు, 3 బస్తీ దవాఖానలు, రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉండగా, వాటి పరిధిలో టీబీ వ్యాధిగ్రస్తులు, లక్షణాలున్న వారిని గుర్తించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 600 మందికిపైగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉండగా, వారికి నిక్షయ్ పోషణ్యోజన కింద పౌష్టికాహారం కోసం ప్రతి నెలా రూ.వెయ్యి సాయం కూడా అందిస్తున్నారు. వంద రోజుల సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే టీబీ లక్షణాలు ఉన్న వారికి సంబంధించి గ్రామస్థాయిలో ఆశా కార్యకర్తల నుంచి సమాచారం సేకరించారు.
లక్షణాలు ఉన్నవారితో పాటు 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, డయాబెటిస్, హెచ్ఐవీ బాధితులు, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉన్న వారిని గుర్తించి వారికి ఎక్స్ రే, తెమడ, ట్రునాట్, సీబీనాట్ తదితర పద్ధతుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి క్షయను నియంత్రించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోగా, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆగస్టు 30 వరకు సర్వే..
టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జిల్లాలో సర్వే ప్రారంభించాం. క్షయవ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నవారితో ఇతర వ్యాధులు ఉన్నవారికి టెస్టులు నిర్వహిస్తాం. ఆగస్టు 30 వరకు సర్వే నిర్వహించి, జిల్లాను టీబీ ఫ్రీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.
డా.హిమబిందు, టీబీ నియంత్రణాధికారి, హనుమకొండ