మాదాపూర్, వెలుగు: సిటీలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని ఎఫ్ఐజీవో ట్రెజరర్, ప్రసూతి అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్, ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎస్. శాంత కుమారి ఆవేదన వ్యక్తంచేశారు. మాదాపూర్లోని హైటెక్స్లో ఫెడరేషన్ ఆఫ్ అబ్స్ట్రెక్టివ్ అండ్ గైనకాలజీ సొసైటీస్ ఆఫ్ ఇండియా (ఎఫ్ వోజీఎస్ఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 66వ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ –2024 సదస్సు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా సోమవారం 'ధీర -మహిళలపై హింసను అరికట్టండి' అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆపదలో ఉన్న మహిళకు మార్గనిర్దేశం చేసేందుకు, సాయం చేయడానికి ఎఫ్వోజీఎస్ఐ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ప్రోగ్రాం కోసం యూనిసెఫ్తో టై అప్ అయ్యామని, 5800 మంది గైనకాలజిస్ట్లు, 6 వేల మంది టీచర్లు మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందారన్నారు.
సుమారు 3 లక్షల మంది స్టూడెంట్లు ఉన్నారన్నారు. షీ టీమ్స్, నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్తో కూడా భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సినీ ప్రొడ్యూసర్ప్రియాంక దత్ , వీ హబ్ సీఈవో దీప్తి రావుల, ప్రొఫెసర్ అని-బీట్రైస్ కిహారా, ఎఫ్వోజీఎస్ఐ ప్రెసిడెంట్ జయదీప్ పాల్గొన్నారు.