
- వైద్య రంగంలో దేశంలోనే..మూడో స్థానంలో ఉన్నాం
- ఎల్లారెడ్డిలో వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపనలో హరీశ్ రావు
- జూన్ 24 నుంచి పోడు పట్టాలిస్తామని వెల్లడి
ఎల్లారెడ్డి, వెలుగు : వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు అన్నారు. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు అన్నీ ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా ఉండేదని కాదన్నారు. ఇప్పుడు ప్రతీ నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. పేషెంట్లకు ఫ్రీ బస్పాస్, పెన్షన్ కూడా ఇస్తున్నామన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మంత్రి హరీశ్రావు వంద పడకల హాస్పిటల్కు శంకుస్థాపన చేశారు. తర్వాత గండిమాసానిపేట్లో నిర్మించిన బస్తీ దవాఖానాను ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది కామారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజ్ ప్రారంభం అవుతుందని, ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉండదన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజ్ ప్రారంభమవుతున్నదని తెలిపారు. వందకు 63శాతం డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ కిట్తో పాటు గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు కూడా అందిస్తున్నామని వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్
తెలంగాణలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు. దీంతో ట్రైబల్ స్టూడెంట్స్కు మెడిసిన్ చదివే అవకాశం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్ కృషి కారణంగానే ఎల్లారెడ్డికి వంద పడకల హాస్పిటల్ మంజూరైందన్నారు. జూన్ 24 నుంచి పోడు భూములకు పట్టాలు అందించబోతున్నామని ప్రకటించారు. పట్టాలతో పాటు రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేందర్, కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శోభ, హాస్పిటల్ సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.