కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమంటే.. తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడమే : మాజీ మంత్రి హరీశ్ రావు

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమంటే..  తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడమే : మాజీ మంత్రి హరీశ్ రావు
  • సాయిచంద్​ విగ్రహావిష్కరణలో మాజీ మంత్రి హరీశ్​రావు

వనపర్తి, వెలుగు: కేసీఆర్​ ఆనవాళ్లు లేకుండా చేయడమంటే.. తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడమేనని మాజీ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. కేసీఆర్​ అంటే ఒక ఉద్యమం, అభివృద్ధి, సంక్షేమం అని గుర్తుంచుకోవాలన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా అమరచింతలో ప్రజా ఉద్యమగాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్​ సాయిచంద్​ రెండో వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, మొన్నటి బీఆర్ఎస్​ సభలో సాయిచంద్​ యాదికొచ్చాడని, ఆయన లేని లోటు కనిపించిందని గుర్తు చేసుకున్నారు. సాయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ తన గుండె బరెవెక్కుతోందని, చిన్న వయసులో ఆయన దూరం కావడం బాధాకరమన్నారు. 

పేదరికంలో పుట్టిన సాయి కష్టాన్ని నమ్ముకున్నాడని, పాట కోసం తపనపడ్డాడని గుర్తు చేశారు. సాయి ఆశయాలను, కేసీఆర్​ ఆలోచనలను సాయి భార్య రజని రూపంలో ముందుకు తీసుకుపోదామని పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు శ్రీనివాస్​గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్  పాల్గొన్నారు.