కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మరో చిత్రం ‘బ్యాండ్మేళం’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన వెంకట్ నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించాడు. మార్చి 13న సినిమా విడుదల కానుంది. మంగళవారం టీజర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటుడు శివాజీ, దర్శకులు శివ నిర్వాణ, నందినీ రెడ్డి, వేణు ఊడుగుల అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ ‘ఈ కథలోని సంఘర్షణ చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ అందరినీ కట్టిపడేస్తుంది. ఏజ్, యాక్టింగ్ సత్తా ఉండటం వల్లే రోషన్, శ్రీదేవిలను తీసుకున్నాం.
సాయి కుమార్ కథ విని షాక్ అయ్యారు. ఈ సినిమాను సక్సెస్ చేసి ఇంకా కొత్త వారిని పరిచయం చేసే శక్తిని, సక్సెస్ను ప్రేక్షకులు అందిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. హర్ష్ రోషన్ మాట్లాడుతూ ‘ఇది పక్కా తెలంగాణ బ్యాక్డ్రాప్ విలేజ్ లవ్స్టోరీ. ప్రతి ఎమోషన్ను పీక్లో చూపించే పాత్ర నాది. ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని చెప్పాడు. ‘కోర్ట్’ మూవీ తరహాలోనే దీనిపై కూడా ఆడియెన్స్ ప్రేమ చూపిస్తారని కోరుకుంటున్నా అని హీరోయిన్ శ్రీదేవి చెప్పింది. ఈ ప్రేమకథ అందర్నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు సతీష్ జవ్వాజీ అన్నాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.
