IND vs ENG: 91 పరుగులకే 5 వికెట్లు.. అయినా ఇంగ్లాండ్ పై 231 పరుగుల తేడాతో టీమిండియా విజయం

IND vs ENG: 91 పరుగులకే 5 వికెట్లు.. అయినా ఇంగ్లాండ్ పై 231 పరుగుల తేడాతో టీమిండియా విజయం

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టెస్టు ఆతిధ్య జట్టుపై 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. లోయర్ ఆర్డర్ లో ఘోరంగా విఫలమవడం భారత పరాజయానికి కారణం. అయితే అదే ఇంగ్లాండ్ టూర్ లో భారత యువ జట్టు ఇంగ్లాండ్ యువ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై మంగళవారం జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో దుమ్ములేపింది. ధనాధన్‌ బ్యాటింగ్‌తో దంచికొట్టిన టీమిండియా అండర్-19 జట్టు ఏకంగా 231 పరుగుల భారీ తేడాతో గెలవడం విశేషం. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 444 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ ఒక దశలో కేవలం 91 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐపీఎల్ స్టార్ కెప్టెన్ మాత్రే కేవలం ఒక పరుగుకే అవుట్ కాగా.. 14 ఏళ్ల ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ 17 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే టీమిండియా లోయర్ ఆర్డర్ అద్భుతంగా రాణించారు. 9 నెంబర్ లో బ్యాటింగ్ చేసిన హర్వంశ్ పంగాలియా కేవలం 52 బంతుల్లోనే అజేయంగా 103 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 8 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 

రాహుల్ కుమార్ 60 బంతుల్లో 73 పరుగులు చేయగా, కనిష్క్ చౌహాన్ 67 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అంతేకాకుండా, ఆర్‌ఎస్ అంబరీష్ 47 బంతుల్లో 72 పరుగులు చేసి బాగా రాణించాడు. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ యంగ్‌ లయన్స్‌ను భారత బౌలర్లు 211 పరుగులకే కట్టడి చేశారు. భారత్ తరఫున దీపేష్ దేవేంద్రన్ మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. నమన్ పుష్పక్ మరియు విహాన్ మల్హోత్రా తలా రెండు వికెట్లు పడగొట్టడంతో భారత అండర్-19 జట్టు సిరీస్ తొలి మ్యాచ్‌ను గెలుచుకుంది.