- జల్సాలకు అలవాటు పడి ..అప్పులు తీర్చేందుకు దొంగతనం
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ల్యాప్టాప్ ల చోరీ ఘటనలో ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడి అప్పులు తీర్చుకునేందుకు ఇద్దరు బీటెక్ విద్యార్థులు, మరో వ్యక్తి కలిసి 60 ల్యాప్టాప్లను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన ప్రకారం... టీఎన్జీఓ కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో నివాసం ఉంటున్న సాయిచరణ్(19), అశ్విన్రావు(19) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు.
వీరికి అదే హాస్టల్లో ఉండి ప్రస్తుతం కూకట్పల్లిలో నివసిస్తున్న చంద్రశేఖర్(30)తో పరిచయం ఏర్పడింది. ముగ్గురూ కలిసి అప్పులు చేయడంతో వాటిని తీర్చేందుకు దొంగతనాలు ఎంచుకున్నారు. ఈ నెల 6న వర్సిటీ అధికారులు సీఆర్రావు ఇన్స్టిట్యూట్లో 60 కొత్త ల్యాప్టాప్లను నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న నిందితులు ఈ నెల 8న కారును అద్దెకు తీసుకుని రాత్రి క్యాంపస్లోకి ప్రవేశించారు.
కిటికీ గ్రిల్స్ను తొలగించి ల్యాప్టాప్లను ఎత్తుకెళ్లారు. వాటిని బెంగళూరులో అమ్మాలని భావించినప్పటికీ, కేసు నమోదు కావడంతో ఆ యత్నాన్ని విరమించుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు టీఎన్జీఓ కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.30 లక్షల విలువైన 60 ల్యాప్టాప్లు, రెండు కార్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
