ఊరెళ్తున్నా అంటే.. ఉరేసుకున్నడు

ఊరెళ్తున్నా అంటే.. ఉరేసుకున్నడు

హైదరాబాద్ : తాగుడు మానకపోతే నిన్ను వదిలేసి పుట్టింటికి వెళ్తానని మాటవరసకు అన్న భార్య మాటలతో మనస్థాపం చెందిన భర్త ఊరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తాళ్లతూర్పు గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్‌(30) బతుకుదెరువు కోసం 10 సంవత్సరాల క్రితం భార్య దేవిదుర్గతో కలిసి హైదరాబాద్ కి వచ్చాడు. ఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న దుర్గా ప్రసాద్‌ దినసరి కూలీ, భార్య హౌస్‌ కీపర్ గా పని చేస్తున్నారు‌. అయితే.. సంవత్సరం కాలంగా రోజూ మద్యం తాగి ఇంటికివచ్చి భార్యతో గొడవపడుతున్నాడు.

దీంతో ఊరికే బెదిరిద్దామని.. మద్యం మానేయకపోతే పుట్టింటికి వెళతానని చెప్పి, భార్య పనికి వెళ్లిపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుర్గాప్రసాద్‌ తలుపులకు గడియ వేసి వైరుతో ఇనుపరాడ్డుకు ఉరేసుకున్నాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన భార్య దేవిదుర్గా తలుపులు తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. గమనించిన దుర్గాప్రసాద్‌ సోదరుడు శివశంకర్‌ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. వైరుతో ఉరేసుకుని కిందపడి ఉన్నాడు. స్థానిక హాస్పిటల్ కి తరలించగా, పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. సోమవారం ఈ సంఘటన జరుగగా ఇవాళ భార్య పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ఎస్ఆర్ నగర్ పోలీసులు.