కేసీఆర్ స్వగ్రామం నుంచే ఆరోగ్య తెలంగాణ

కేసీఆర్ స్వగ్రామం నుంచే ఆరోగ్య తెలంగాణ

ఆరోగ్య తెలంగాణా కు అడుగులు సీఎం కేసీఆర్ స్వగ్రామం నుంచేనన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. చింతల్లేని తెలంగాణ కూడా చింత మడక నుంచేనన్నారు. సిద్ధిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి వారి సౌజన్యం తో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదొక చారిత్రాత్మక ఆరోగ్య సూచీ అన్నారు. దేశంలోనే ప్రథమన్నారు. మొట్టమొదటి సారిగా చింత మడక, మాచపూర్ , సీతారాం పల్లి నుండే ఆరంభం కావడం శుభసూచకమన్నారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావించారని తెలిపారు. ఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాల తర్వాత మన దగ్గర మొదటప్రారంభమైందన్నారు. కేసీఆర్ కృషి కారణంగానే చింత మడక గ్రామానికి యశోద ఆసుపత్రినే తీసుకువచ్చారని తెలిపారు హరీశ్ .

కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి యశోద ఆసుపత్రి నిర్వాహకులు ఈ క్యాంప్ నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  8 రోజుల్లో 5, 561 మందికి 36, 146 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పారు. అంతేకాదు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత,శుభ్రత, పరిసరాల శుభ్రత అవసరమన్నారు. జబ్బులు రాకుండా చూసుకునే బాద్యత మనపైనే ఉందన్నారు. త్వరలోనే గ్రామ అభివృద్ధి కోసం సమావేశం నిర్వహిస్తామన్న హరీశ్ రావు.. ఈ గ్రామంలో మొదటి కార్యక్రమం హెల్త్ క్యాంప్ తో ప్రారంభం చేసుకున్నామన్నారు.