కాకినాడ సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

కాకినాడ సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్‌ హౌజ్‌ సెంటర్‌లోని సూపర్‌ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత సూపర్‌ మార్కెట్‌లో మంటలు చెలరేగి మూడు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో  ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో పెద్దాపురం, పిఠాపురం నుంచి మరో నాలుగు ఫైరింజన్లను రప్పించారు. కొన్ని గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. సూపర్ మార్కెట్‌లో ప్లాస్టిక్, స్కూలు బ్యాగులు, బట్టల షాపులు ఉండడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.2 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.