
శుక్రవారం ( జూన్ 27 ) హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. అప్పటిదాకా వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి, కేపీహెచ్బీ, వివేకానంద నగర్, సుమిత్ర నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో గత మూడురోజులుగా పెరిగిన ఎండ తీవ్రతతో అల్లాడిన జనం కాస్త రిలాక్స్ అయ్యారు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమవ్వడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సాయంత్రం సమయం కావడంతో స్కూళ్ళు, కాలేజీల నుంచి ఇళ్లకు బయలుదేరిన స్టూడెంట్స్, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఇబ్బంది పడ్డారు. గురువారం ( జూన్ 26 ) బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా,పశ్చిమ బెంగాల్ తీరంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
శుక్రవారం ( జూన్ 27 ) ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.