తెలంగాణలో రానున్న 4 రోజులు వానలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో రానున్న 4 రోజులు వానలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
  • మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్తాయన్న ఐఎండీ
  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
  • హైదరాబాద్​లో దంచికొట్టిన వాన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దాంతో పాటు బలమైన గాలులూ వీస్తాయని చెప్పింది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు హైదరాబాద్​లోనూ 2 రోజుల పాటు వర్షాలు పడ్తాయని ఐఎండీ వెల్లడించింది.

 కాగా, గురువారం మధ్యాహ్నం 3 గంటలదాకా హైదరాబాద్​ సిటీలో ఎండ కొట్టినా.. హఠాత్తుగా మబ్బులు కమ్మేసింది. సిటీ అంతటా వర్షం దంచికొట్టింది. ఇటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్​లో 8.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వేంసూరులో 8.3 సెంటీ మీటర్లు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 7.9, మేడ్చల్ జిల్లా నాచారంలో 7.8, మెట్టుగూడలో 6.9, ఖమ్మం జిల్లా మధిరలో 6.7, యాదాద్రి జిల్లా నారాయణపూర్​లో 6.4, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో 6.1 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.