
- గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు: ఐఎండీ
- ఇప్పటిదాకా లోటు వర్షపాతమే
- 32.4 మిల్లీమీటర్లు పడాల్సి ఉన్నా.. కురిసింది 25 మిల్లీమీటర్లే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని, గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. గురువారం ఉత్తరాంధ్ర, కోస్తా తీరాల్లో కొనసాగిన ఉపరితల ఆవర్తనం.. శుక్రవారం తెలంగాణ, ఇంటీరియర్ కర్నాటక, రాయలసీమ ప్రాంతాలపై ఉన్నదని పేర్కొంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచే ద్రోణి ఏర్పడిందని తెలిపింది.
లోటు వర్షపాతమే..
రాష్ట్రంలోకి త్వరగా నైరుతి రుతుపవనాలు వచ్చినా.. ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 32.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉన్నా.. ఇప్పటివరకూ కేవలం 25 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైందని పేర్కొంది. మొత్తంగా 4 జిల్లాల్లోనే అత్యధిక వర్షపాతం, 3 జిల్లాల్లో అధిక వర్షపాతం, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డ్ అయినట్టు వెల్లడించింది. 11 జిల్లాల్లో భారీ లోటు నమోదైందని తెలిపింది. మరో 13 జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయిందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 23 శాతం తక్కువ వర్షాలు పడ్డాయని పేర్కొంది. అయితే, ఇప్పటి నుంచి ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 19 నాటికి సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం, 20 నుంచి 26 మధ్య సాధారణ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది.
రాష్ట్రమంతా ముసురు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు
శుక్రవారం రాష్ట్రమంతా ముసురుపట్టింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలోనూ పలు చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లా దత్తప్పగూడలో 7.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 6.6 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా దగడలో 5.4, మెదక్ జిల్లా నాగపూర్లో 4.3, ఆదిలాబాద్ జిల్లా నామూరులో 4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 3.9, నల్గొండ జిల్లా నకిరేకల్, అయిటిపాములలో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్నగరంలోని అడ్డగుట్టలో 1.9 సెంటీమీటర్లు, ఎల్బీ స్టేడియం 1.3, నాగోల్లో 1.3, హయత్నగర్లో 1.1 సెంటీమీటర్ల చొప్పున నమోదైంది. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ఉప్పల్, సరూర్నగర్, షేక్పేట, బాలానగర్లోనూ వర్షం కురిసింది.