సిటీలో సోమవారం సాయంత్రం కురిసిన వానకు పలు కాలనీలు నీట మునిగాయి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇండ్లకు వెళ్లే టైమ్లో వర్షం పడటంతో వాహనదారులు ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడ్డారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం, కొంపల్లి, నిజాంపేట, బండ్లగూడ, ఉప్పల్, మల్కాజిగిరి, సరూర్నగర్, సనత్నగర్, అమీర్పేట, పంజాగుట్ట, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్లో రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది.
అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ వెళ్లే రూట్లో పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నం.193 వద్ద వరద నీరు రోడ్లపై చేరడంతో దాదాపు 2 గంటల పాటు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అపురూప కాలనీలోని జనప్రియ అపార్ట్ మెంట్ వద్ద రోడ్డు చెరువును తలపించింది. మరోవైపు ఆదివారం రాత్రి సిటీలో కురిసిన భారీ వానకు చాలా కాలనీల్లోని అపార్ట్మెంట్ల సెల్లార్లో నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల జనం ఇబ్బందులు పడ్డారు. మూడ్రోజులుగా దంచి కొడుతున్న వానలకు జవహర్నగర్ డంపింగ్ యార్డులోని మురుగు కార్మికనగర్లోని ఇండ్లలోకి చేరుతుండటంతో స్థానిక జనం సోమవారం ఉదయం కాంగ్రెస్, బీజేపీ నేతలతో కలిసి డంపింగ్ యార్డ్ ముందు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్/గండిపేట/జీడిమెట్ల/జవహర్నగర్, వెలుగు