ఖమ్మంలో కుండపోత .. పొంగిపొర్లుతున్న వాగులు

ఖమ్మంలో కుండపోత .. పొంగిపొర్లుతున్న వాగులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఖమ్మం జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి వస్తున్న ప్రవాహంతో మున్నేరు, ఆకేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తీర్థాల దగ్గర లోలెవల్ వంతెనపై నుంచి ఆకేరు వరద పారుతోంది. పాలేరు రిజర్వాయర్​లో నిండడంతో అలుగు పారుతోంది. కాల్వల ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గోళ్లపాడు, తీర్థాల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కస్నా తండా బ్రిడ్జిని ఆనుకొని వరద ప్రవహిస్తోంది. తనగంపాడు-, గూడూరుపాడు చెక్ డ్యాంలు మునిగాయి. జిల్లాలో అత్యధికంగా బోనకల్ మండలం రావినూతలలో 52.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 
 

ముదిగొండలో 51.3, నేలకొండపల్లిలో 49.3, ఖమ్మం రూరల్ లో 46, కూసుమంచిలో 44.5, మధిరలో 39, రఘునాథపాలెంలో 37.8, కొణిజెర్లలో 37.3, చింతకానిలో 34.5, తిరుమలాయపాలెంలో 33.3, వైరాలో 28, తల్లాడలో 27.5, కామేపల్లిలో 24.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం సిటీలోని రిక్కబ్ బజార్, మయూరి సెంటర్, వినోదమహల్ రోడ్డు, ఓల్డ్ బస్టాండ్ సెంటర్ ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగి, రోడ్లపై వరద పారింది. రాజేంద్రనగర్ స్కూల్ గ్రౌండ్ లో మోకాలు లోతులో నీళ్లు నిలవడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడ్డారు. కూసుమంచి గంగాదేవి చెరువు అలుగు సమీపంలోని బీటీ రోడ్డు మంగళవారం ధ్వంసమైంది. అలాగే భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముసురు వాన కురిసింది. అశ్వాపురంలో అత్యధికంగా 58.2 మిల్లీమీటర్ల వాన కురిసింది. దుమ్ముగూడెంలో 55.4, ఇల్లెందులో 55.2, జూలూరుపాడులో 52, మణుగూరులో 46.8, భద్రాచలంలో 42.2, గుండాలలో 33, ఆళ్లపల్లిలో 31.2, చర్లలో 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అశ్వాపురం మండలం నెల్లిపాక వద్ద మొండికుంట–సారపాక రోడ్డుపై పెద్ద చెట్టు కూలింది. ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాలోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ పెరుగుతోంది. శబరి, సీలేరు ఉప నదులు పొంగుతున్నాయి. అధికారులు భద్రాచలం కరకట్ట విస్తా కాంప్లెక్స్ సమీపంలో భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. అశోక్​నగర్​కొత్తకాలనీకి చెందిన 24 కుటుంబాలను నన్నపునేని మోహన్​హైస్కూల్ పునరావాస కేంద్రంలోనే ఉంచారు. 

వెలుగు, ఖమ్మం/ఖమ్మం రూరల్/ఖమ్మం కార్పొరేషన్/కూసుమంచి/భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం