వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతపాన్ని చూపిస్తున్నాడు.తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో ఆఫీసులకు వెళ్లే వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు తీవ్ర సతమతమవుతున్నారు.
వేసవి ప్రారంభం కావడంతో తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణలో ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం 9 గంటల తర్వాత భానుడు భగభగ మండుతుండటంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో.. ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉక్కపోత, వడగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం వరకు వేడి తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం ( మార్చి 27)హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అయితే.. ఏప్రిల్నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రహదారుల వద్ద సిగ్నల్స్ వద్ద వాహనదారులు నరకయాతన పడుతున్నారు. తాజాగా.. ఎండలో నడిచే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండకు గురికావడం వల్ల పొడిబారడం, ఎరుపుదనం, తలనొప్పి, దురద, వాంతులు మరియు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. బీపీ, షుగర్, గుండె జబ్బులు, చర్మవ్యాధులు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఓఆర్ ఎస్ ద్రావణం లేదా ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం తీసుకుంటే… చెమట రూపంలో పోగొట్టుకున్న లవణాలు తిరిగి శరీరానికి అందుతాయి. రోజూ సూర్యోదయానికి ముందు వ్యాయామం చేయడం మంచిదన్న సంగతి తెలిసిందే.. మాంసాహారం ఎక్కువగా తింటే శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.