యుద్దాలు జరిగినా అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభం వచ్చినా... ఇక ఎల్పీజీ కొరత ఉండదు

యుద్దాలు జరిగినా అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభం వచ్చినా... ఇక ఎల్పీజీ కొరత ఉండదు
  •    కొరత ఏర్పడినప్పుడు ఫుల్ స్పీడ్‌‌‌‌లో  ఉత్పత్తి జరగాలని ఆదేశం
  •     రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌కు  ఎక్కువ కోటా
  •     రోజుకి 63,810 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేసేలా రెడీగా ఉండాలని కంపెనీలకు ఆదేశాలు

న్యూఢిల్లీ: విదేశాల్లో యుద్ధాలు జరిగినా, అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభం వచ్చినా  మన దేశంలో వంట గ్యాస్ సిలిండర్లకు కొరత రాకుండా ఉండేందుకు  కేంద్ర ప్రభుత్వం ఒక  మాస్టర్ ప్లాన్‌‌‌‌ను రెడీ చేసింది. చరిత్రలోనే మొదటిసారిగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆయిల్ రిఫైనరీలకు ఎల్పీజీ ప్రొడక్షన్‌ టార్గెట్లను పెట్టింది.   కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం,  దేశంలోని 21 రిఫైనరీలు, చమురు ఉత్పత్తి సంస్థలు కలిసి రోజుకు ఏకంగా 63,810 టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని రెడీ చేసుకోవాలి.  ఇది మన దేశ రోజువారీ మొత్తం గ్యాస్ అవసరాలలో దాదాపు 70 శాతానికి సమానం. కంపెనీలు తమ సాధారణ రోజుల్లో సాధారణ స్థాయిలోనే ఉత్పత్తిని కొనసాగించొచ్చు.  కానీ అత్యవసర పరిస్థితి లేదా కొరత వచ్చిన వెంటనే తమకు కేటాయించిన కోటా ఆధారంగా కనీస ఉత్పత్తి జరపాలి.  

 ఎందుకీ కోటా?

భారతదేశంలో రోజుకు సగటున దాదాపు 91 వేల టన్నుల వంట గ్యాస్ ఖర్చవుతుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 332 లక్షల ఎల్పీజీ వినియోగం జరిగింది. ఇందులో మనం దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటున్నది కేవలం 36 శాతం (రోజుకు దాదాపు 35,900 టన్నులు) మాత్రమే. మిగిలిన 64 శాతానికి పైగా గ్యాస్ కోసం మనం విదేశాల నుంచే, ముఖ్యంగా సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల నుంచి వచ్చే  దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఇటీవల ఇరాన్ యుద్ధ సంక్షోభం వల్ల  మన దేశానికి చమురు సరఫరా చేసే ప్రధాన సముద్ర మార్గమైన 'హార్మూజ్ జలసంధి'  మూతపడింది. ఫలితంగా భారత్‌‌‌‌కు రావాల్సిన గ్యాస్ షిప్పులు ఆగిపోయి దేశంలో తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో ప్రభుత్వం హోటళ్లు, వాణిజ్య అవసరాలకు సరఫరా తగ్గించి, ఇళ్లలో సిలిండర్ బుకింగ్ గడువును పెంచాల్సి వచ్చింది. అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో మళ్లీ రాకూడదనే ఉద్దేశంతో, దేశీయంగానే అత్యవసర సమయాల్లో గ్యాస్ ఉత్పత్తిని రెట్టింపు చేసేలా ఈ  విధానాన్ని తీసుకొచ్చింది.

కంపెనీలకు ఉత్పత్తి లక్ష్యాలు..

దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలకు వాటి సామర్థ్యాన్ని బట్టి ఉత్పత్తి పరిమితులను నిర్ణయించారు.  ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్‌‌‌‌కు చెందిన దేశీయ మార్కెట్ రిఫైనరీకి  అత్యధికంగా రోజుకు 18 వేల టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాన్ని విధించారు. ప్రభుత్వ పరిధిలోని ఐఓసీ, హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌, బీపీసీఎల్‌‌‌‌, ఇతర సంస్థలకు చెందిన 18  రిఫైనరీలు కలిపి రోజుకు 31,470 టన్నుల గ్యాస్‌‌‌‌ను ఉత్పత్తి చేయాలి. రష్యా రోస్‌‌‌‌నెఫ్ట్‌‌‌‌కు వాటాలున్న నయారా ఎనర్జీ (గుజరాత్ వాడినార్ రిఫైనరీ) ప్రైవేట్ ప్లాంట్‌‌‌‌కు రోజుకు 4,480 టన్నుల టార్గెట్ ఇచ్చారు. నేచురల్ గ్యాస్‌‌‌‌ నుంచి  ఎల్పీజీ తయారు చేసే  ఓఎన్‌‌‌‌జీఎస్‌‌‌‌, గెయిల్‌‌‌‌ వంటి గ్యాస్ ప్రాసెసింగ్ కంపెనీలు రోజుకు 6,460 టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి 
చేయాల్సి ఉంటుంది.

ఏటా రెండు సార్లు రివ్యూ..

సంక్షోభ పరిస్థితులు వచ్చినప్పుడు ప్లాస్టిక్, ఇతర రసాయనాల తయారీకి వాడే ‘నాఫ్తా’ వంటి ముడి పదార్థాలను దారి మళ్లించి, వంట గ్యాస్ ఉత్పత్తి కోసం మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. అలానే ఇప్పటికే  ఉన్న మెషినరీని ఆధునీకరించి గరిష్ట స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచే చర్యలు చేపట్టాలని తెలిపింది. ఉత్పత్తి చేసిన గ్యాస్‌‌‌‌ను నిల్వ చేయడానికి, సిలిండర్ బాట్లింగ్ ప్లాంట్లకు రైల్వేలు, రోడ్డు ట్యాంకర్ల ద్వారా వేగంగా రవాణా చేయడానికి అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరుచుకోవాలని సూచించింది.   ప్రతి ఏటా జనవరి 1, జులై 1వ తేదీల్లో ఈ ఉత్పత్తి షెడ్యూల్‌‌‌‌ను రివ్యూ చేసి, కొత్తగా వచ్చే ప్లాంట్లు లేదా పెరిగిన సామర్థ్యానికి అనుగుణంగా టార్గెట్లను సవరిస్తారు.