న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ డైరెక్షన్ను ఈ వారం అమెరికా–-ఇరాన్ ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి పరిణామాలు, అంతర్జాతీయ ముడి చమురు ధరలు నిర్ణయిస్తాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ సీజన్ ముగియడంతో ఇన్వెస్టర్ల దృష్టి పూర్తిగా గ్లోబల్ అంశాలు, విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐల) కదలికల వైపు మళ్లిందని తెలిపారు. ఈ నెల 19న విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ జులై పాలసీ మినిట్స్ను ఇన్వెస్టర్లు గమనించనున్నారు. దీనికి తోడు పశ్చిమాసియాలో సంక్షోభం, బ్రెంట్ క్రూడ్ ధరల పెరుగుదల, చైనా ఎకనామిక్ డేటా కీలకం కానున్నాయి. కాగా, గత వారం సెన్సెక్స్ 489.92 పాయింట్లు (0.62శాతం), నిఫ్టీ 204.65 పాయింట్లు (0.83శాతం) నష్టపోయి రెండు వారాల లాభాలకు బ్రేక్ వేశాయి.
కొంటున్న విదేశీ ఇన్వెస్టర్లు
అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, కంపెనీల వాల్యుయేషన్స్ ఆకర్షణీయంగా ఉండడం, క్వార్టర్లీ ఫలితాలు మెప్పించడంతో ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నెల మొదటి 15 రోజుల్లో నికరంగా రూ. 16,621 కోట్లు పెట్టుబడి పెట్టారు. కిందటి నెలలో ఈక్విటీలలోకి రూ. 20,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే, 2026లో ఇప్పటివరకు నికర అమ్మకాలు రూ. 2.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
