న్యూఢిల్లీ: వెనెజువెలాలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వ కంపెనీ ఓఎన్జీసీకి చెందిన విదేశీ విభాగం ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ (ఓవీఎల్)కు అమెరికా అనుమతులిచ్చింది. దీంతో ఆంక్షల భయం లేకుండా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిని చేపట్టడానికి వీలుంటుంది. ఓఎన్జీసీకి ఈ సౌత్ అమెరికా దేశంలో ‘శాన్ క్రిస్టోబల్’ ప్రాజెక్టులో 40శాతం, ‘కారబోబో’ ప్రాజెక్టులో 11శాతం వాటా ఉంది.
తాజాగా పొందిన లైసెన్స్తో ఈ ప్రాజెక్టులను నిర్వహించడం ఈజీ అవుతుంది. అంతేకాకుండా సంస్థకు రావాల్సిన 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4,800 కోట్ల) డివిడెండ్ను రికవర్ చేసుకునే అవకాశం దక్కుతుంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు (దాదాపు 303 బిలియన్ బ్యారెళ్లు) గల వెనెజువెలాలో పెట్టుబడులు పెంచి, ఉత్పత్తిని విస్తరించడంతో పాటు ప్రాజెక్టులను ఆపరేట్ చేసే పూర్తి హక్కు కూడా దక్కించుకోవాలని ఓఎన్జీసీ భావిస్తోంది.
