
- నోటిఫికేషన్ ఇచ్చాక ఆపేందుకు వీల్లేదు: హైకోర్టు
- విచారణ ఈ నెల 22కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ కోసం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ను అమలు చేయాలని చెప్పింది. తగిన కారణాలు లేకుండా ఎన్నికలను నిలిపివేయడం చెల్లదని తెలిపింది. చట్ట ప్రకారం నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్నికలను ఆపేందుకు వీల్లేదని వెల్లడించింది. ఫిలింనగర్ సొసైటీ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే ఆపేస్తూ రాష్ట్ర సహకార ఎన్నికల అధికారి జూన్ 13న ఇచ్చిన ప్రొసీడింగ్స్ను రద్దు చేయాలంటూ పి.ఉదయ భాస్కర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి ఇటీవల విచారించారు.
పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ ఆర్.ఎన్.హేమేంద్రనాథ్రెడ్డి వాదిస్తూ, గత మే 20న ఫిలింనగర్ సొసైటీ పాలకమండలి గడువు ముగిసిందని, ఆ గడువు ముగియకముందే రాష్ట్ర సహకార సంఘాల డైరెక్టర్ ఎన్నికల నిర్వహణకు రికార్డులు సమర్పించాలని ఆదేశాలిచ్చారని చెప్పారు. ఫిలింనగర్ సొసైటీ సెక్రటరీ ఓటర్ల లిస్ట్తోపాటు రికార్డులను అందజేశారని వివరించారు. ప్రతిపాదిత ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు కోరుతూ నోటీసు కూడా ఇచ్చారన్నారు.
ఆ తర్వాత ఎన్నికల నిర్వహణాధికారిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ను నియమించారని, దీంతో జూన్ 7న ఎన్నికల షెడ్యూలును విడుదల చేసి, 11, 12, 13 తేదీల్లో కమిటీ మెంబర్ పోస్టులకు నామినేషన్లు సమర్పించాలని ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువరించారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను నిలిపివేస్తూ జూన్ 13న రాష్ట్ర సహకార సంఘాల ఎన్నికల అధికారి ఉత్తర్వులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
వాదనలు విన్న హైకోర్టు.. ఎన్నికలను వాయిదా వేయడానికి తగిన కారణమే లేదని, ఎన్నికల ప్రక్రియ ఎక్కడ వరకు అమలు జరిగిందో అక్కడి నుంచే తిరిగి కొనసాగించాలని, ఎన్నికల నోటిఫికేషన్ను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సహకార సంఘం, ఫిలింనగర్ సొసైటీలు తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.