ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం.. అహ్మదాబాద్ దుర్ఘటన మరువక ముందే..

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం.. అహ్మదాబాద్ దుర్ఘటన మరువక ముందే..

ఉత్తరాఖండ్: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన జరిగి రోజులు కూడా గడవక ముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్లి తిరిగొస్తున్న హెలికాఫ్టర్ ఉత్తరాఖండ్లోని గౌరీకుంద్ అడవుల్లో వాతావరణం అనుకూలించక కుప్పకూలింది. పైలట్తో కలిపి మొత్తం హెలికాఫ్టర్లో ఏడుగురు ఉన్నారు. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురూ మృతి చెందడం విషాదం నింపింది. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాఫ్టర్ అని తెలిసింది. కేదార్నాథ్ ధామ్ నుంచి గుప్తాక్షికి హెలికాఫ్టర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లో 40 రోజుల వ్యవధిలో ఇది ఐదో హెలికాఫ్టర్ ప్రమాదం కావడం శోచనీయం.

కేదార్నాథ్ వ్యాలీలో వాతావరణం పూర్తి మేఘావృతమై ప్రతికూలంగా ఉండటంతో హెలికాఫ్టర్ దారి తప్పింది. సిగ్నల్ కోల్పోయింది. ఈ ఘటనపై అడిషనల్ డైరెక్టర్ జనరల్ (Law and Order) డాక్టర్ వి.మురుగేశన్ మాట్లాడుతూ.. త్రియుగీ నారాయణ్, గౌరీకుంద్ మధ్య సిగ్నల్ మిస్ అయిందని చెప్పారు. రుద్రప్రయాగ్ జిల్లాలో హెలికాఫ్టర్ కుప్పకూలిందని విషాద వార్త తమకు తెలిసిందని, హెలికాఫ్టర్లోని వారంతా క్షేమంగా బయటపడాలని బాబా కేదార్ను ప్రార్థిస్తున్నానని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

విమాన ప్రమాదాలు, హెలికాఫ్టర్ కుప్పకూలుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాణాలు గాల్లో దీపంలా మారిపోవడం విమాన ప్రయాణం అంటేనే భయపడేలా చేస్తున్నాయి. అహ్మదాబాద్​లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 270 దాటిన సంగతి తెలిసిందే. విమానం మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కూలడంతో అక్కడ ఐదుగురు మెడికోలు సహా 34 మంది చనిపోయారు. 

బిల్డింగ్పై విరిగి ఇరుక్కుపోయిన విమానం తోకభాగంలో శనివారం ఓ డెడ్ బాడీని, శిథిలాల నుంచి కొన్ని శరీర భాగాలను వెలికి తీశామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 11 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబసభ్యులతో సరిపోలిందని శనివారం రాత్రి బీజే మెడికల్ కాలేజీ డాక్టర్లు వెల్లడించారు. మిగతా డెడ్ బాడీల డీఎన్ఏ టెస్టులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.