
శ్రీశైలం భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని నటుడు అర్జున్ దర్శించుకున్నారు. సోమవారం (మే 26) మల్లన్న ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్జున్ వస్తున్నారన్న సమాచారంతో ఆలయ గోపురం వద్ద అర్చకులు, అధికారులు అర్జున్ కు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అర్జున్ ను చూసేందుకు భక్తులు గుమిగూడటంతో వారికి అభివాదం చేసి దర్శనానికి వెళ్లారు.
పూర్ణ కుంభంతో ఘనంగా ఆహ్వానించి స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అర్జున్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో కాసేపు గడిపారు. ఆలయ చరిత్రను పండితులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని గోశాలలో ఉన్న ఎద్దులతో కాసేపు గడిపారు. స్వయంగా తన చేతితో తినిపించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు అర్జున్. ‘‘శ్రీశైలం రావడం తనకు ఎంతో ఇష్టమని, వచ్చిన ప్రతీసారి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని అన్నారు. స్వామి, అమ్మ వార్ల ఆశీస్సులతో తను విజయవంతంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.