
ఫాం హౌస్ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వ రిట్ అప్పీలుపై దాఖలు చేయడంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం దానిపై విచారణ జరిపింది. ఉదయం ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. లంచ్ బ్రేక్ అనంతరం రోహిత్ రెడ్డి తరఫున గండ్ర మోహన్ వాదనలు కొనసాగించారు. తన క్లయింట్ కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే కింది కోర్టు తీర్పు ఇచ్చిందని రోహిత్ రెడ్డి తరఫు లాయర్ ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. దాన్ని రద్దు చేసి సీబీఐకు అప్పగించడం సరికాదని అన్నారు.
ప్రతిపాదిత నిందితుల తరఫున వాదనలు వినిపించిన సీతారామ్మూర్తి రిట్ అప్పీల్ పిటిషన్ అసలు మెయింటేనబుల్ కాదని కోర్టుకు తెలిపారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్పై రిట్ అప్పీల్కు అవకాశంలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. రివిజన్ పిటిషన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉదయం ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యంతరాలను న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించిన తర్వాతే అవి సీఎం కేసీఆర్ చేతికి వెళ్లాయని కోర్టుకు విన్నవించారు. పైలెట్ రోహిత్ రెడ్డి సాక్ష్యాలు, ఆధారాలను సీఎం కేసీఆర్ కు ఇచ్చి ఉంటారని కోర్టుకు చెప్పారని, అయితే అలా జరగలేదని దవే న్యాయమూర్తికి వివరించారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కోర్టుకు సరైన సమాచారం అందించలేకపోయారని చెప్పారు. సీఎం ప్రెస్ మీట్ కు ముందే ఆ వీడియోలు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేవలం ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని సాకుగా చూపి కేసులో సీబీఐకు అప్పగించడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంటే పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని చెప్పారు.