
హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు భవన సముదాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 80 ఎకరాలు కేటాయించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ సూచించారు. ఇటీవలే సీజేగా వచ్చిన ఆయనను, న్యాయమూర్తిగా వచ్చిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను, సీనియర్ న్యాయమూర్తి రాజశేఖర్రెడ్డిని తెలంగాణ బార్ కౌన్సిల్ గురువారం సన్మానించింది. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ కొత్త హైకోర్టు కాంప్లెక్స్ ఏర్పాటుకు రాష్ట్రం 80 ఎకరాలిచ్చేలా ప్రయత్నించాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్కు సూచించారు. బార్ కౌన్సిల్ కొత్త భవనాల కోసం కూడా భూమి కేటాయించేలా చూడాలన్న కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి విజ్ఞప్తికి సీజే సానుకూలంగా స్పందించారు. ఎ.నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏజీ బీఎస్ ప్రసాద్, హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.అశోక్ గౌడ్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, పి.విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.