- సమాచార శాఖ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్కు హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ వినతి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అక్రిడిటేషన్ల జీవో 252లో అనేక లోపాలున్నాయని, వెంటనే వాటిని సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం(డిసెంబర్23) సమాచార శాఖ డైరెక్టర్ కిషోర్ బాబు, అడిషనల్ డైరెక్టర్ జగన్ ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. కొత్తగా అక్రిడిటేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నామని.. అయితే జీవోలో ఉన్న కొన్ని నిబంధనలు జర్నలిస్టుల పొట్టకొట్టేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో 252లో జర్నలిస్టులను రెండు వర్గాలుగా విభజించడం సరికాదని ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. రిపోర్టర్లకు అక్రిడిటేషన్ అని, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు అని పేర్లు పెట్టి విభజించడం వల్ల డెస్క్ లో పనిచేసేవారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేంద్రం తీరుతో రైల్వే పాసులు పోయాయని, ఆర్టీసీ రాయితీ కూడా తగ్గించారని గుర్తు చేశారు. ఇప్పుడు మీడియా కార్డు పేరుతో డెస్క్ జర్నలిస్టులకు పూర్తిగా బస్ పాస్ సౌకర్యం లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. డెస్కు జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
►ALSO READ | షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్..ఇన్సులిన్ ఇన్ హేలర్స్ వచ్చేశాయ్.. ఇక ఇంజక్షన్ అవసరం లేదు..
కొత్త నిబంధనల వల్ల చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రిడిటేషన్లు దక్కకుండా పోతున్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే భారీగా కార్డుల సంఖ్యను తగ్గించారని, దీనివల్ల వందలాది మంది వర్కింగ్ జర్నలిస్టులకు కార్డులు అందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాల్సిందేనని హెచ్యూజే, టీడబ్ల్యూజేఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. జీవో 252 లోపాలను సవరించి, డెస్క్ జర్నలిస్టులను, చిన్న పత్రికలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అడ్ హక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, గుడిగ రఘు, హెచ్యూజే కార్యదర్శి జగదీశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ఉపాధ్యక్షులు దామోదర్, జాతీయ నాయకులు డెస్కు జర్నలిస్టులు ఉపేందర్, మస్తాన్, సురేష్, కిరణ్, నరేష్, విజయభాస్కర్... తదితరులు పాల్గొన్నారు. కాగా దీనిపై స్పందించిన అడిషనల్ డైరెక్టర్ జగన్ ... మీడియా కార్డులకు, అక్రిడిటేషన్ కార్డులకు ఒకే రకమైన సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. బస్సు పాస్లనూ ఇవ్వనున్నామని తెలిపారు.
ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి..
జర్నలిస్టులకు పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్లుగానే జర్నలిస్టులకు కూడా ఆరోగ్య విధానాన్ని (హెల్త్ స్కీమ్) అమలు చేయాలన్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
