బీసీ రిజర్వేషన్‌‌‌‌ల పెంపుపై స్టే పొడిగించిన హైకోర్టు

బీసీ రిజర్వేషన్‌‌‌‌ల పెంపుపై స్టే పొడిగించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌‌‌‌లను 24 నుంచి 42 శాతం పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు బుధవారం మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా జీవో 9, 41, 42ల స్టే కొనసాగుతుందని తెలిపింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 అనంతరం రెండు వారాల్లో రిప్లయ్‌‌‌‌ కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌‌‌‌లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డితోపాటు మరికొందరు పిటిషన్‌‌‌‌లు దాఖలు చేసిన విషయం విదితమే. దీంతో రిజర్వేషన్‌‌‌‌లను సమర్థిస్తూ తమనూ ప్రతివాదులుగా చేర్చి తమ వాదనలూ వినాలంటూ పలువురు కాంగ్రెస్‌‌‌‌ నేతలు పిటిషన్‌‌‌‌లు దాఖలు చేశారు. 

వీటన్నింటిపై చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌‌‌లతో కూడిన బెంచ్‌‌‌‌ బుధవారం విచారణ చేపట్టగా ప్రతివాదులెవరూ కౌంటరు దాఖలు చేయలేదు. దాంతో మరో అవకాశం ఇస్తూ విచారణను కోర్టు వాయిదా వేసింది.