హైదరాబాద్, వెలుగు: శ్రీరామ నవమి శోభాయాత్రను పోలీసులు నిర్ణయించిన మార్గంలోనే నిర్వహించాలని కేసరి హనుమాన్ యువ సంఘటన్ ను హైకోర్టు ఆదేశించింది. అలా అయితేనే శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు సూచించింది. టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో శోభాయాత్ర నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ సంఘటన్ అధ్యక్షుడు అడ్డాల కార్తీక్ లంచ్మోషన్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ను హైకోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. శోభాయాత్ర కేసరి హనుమాన్ మందిర్ నుంచి దరియాబాగ్, కార్వాన్ మార్కెట్, ధర్బార్ మైసమ్మ ఆలయం, గంగా పరమేశ్వరి ఆలయం వద్ద ముగిసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. పిటిషనర్ కోరిన మార్గంలో యాత్రకు అనుమతిస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. వాదనలు విన్న హైకోర్టు..పోలీసులు నిర్ణయించిన మార్గంలోనే శోభాయాత్ర నిర్వహించుకుంటామంటే పిటిషనర్కు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.