హైదరాబాద్, వెలుగు: ఓ కేసులో కొత్త అంశాలను పేర్కొనకుండా పాత చార్జిషీట్లోని విషయాలతోనే అదనపు చార్జిషీట్ దాఖలు చేస్తే చెల్లదని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. నిరాధార అభియోగాలతో కేసు నమోదు చేయడం కుదరదని తెలిపింది. ఫాతిమా అనే మహిళ తన భర్త దబీరుద్దీన్ ఖాజా, అత్తమామలు, ఆడపడుచులు ఇతరులపై వరకట్న వేధింపుల కింద ఎస్ఆర్ నగర్ పీఎస్లో కేసు నమోదు చేశారు. దీనిపై 2008లో పోలీసులు కోర్టుకు దాఖలు చేసిన చార్జిషీట్లో ఖాజాపై మాత్రమే అభియోగాలు ఉన్నాయని తెలిపారు. మళ్లీ రెండేండ్ల తర్వాత దర్యాప్తు తిరిగి ప్రారంభించిన పోలీసులు అదనపు చార్జిషీట్ దాఖలు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఫస్ట్ చార్జిషీట్లోని విషయాలతో అదనపు చార్జిషీట్ దాఖలు చేయడం చెల్లదని పిటిషనర్ లాయర్ కోర్టుకు తెలిపారు. సౌదీలో ఉన్న భర్త, ఆయన తల్లిదండ్రులు, సోదరులు, బావలను ఫాతిమా కేసులో నిందితులుగా చేర్చుతూ అదనపు చార్జిషీట్ దాఖలు చేయడం అన్యాయమన్నారు. కోర్టు స్పందిస్తూ.. అసంబద్ధ ఆరోపణలపై సెక్షన్ 498ఏ కింద విచారణ చేయడానికి వీల్లేదని తెలిపింది. కొత్త అభియోగాలు లేకుండా అదనపు చార్జిషీట్ దాఖలు చేస్తే చెల్లదంటూ తీర్పు చెప్పింది.